భూపాలపల్లి రూరల్, జనవరి 17: పలు సమస్యలపై ప్రజావాణిలో అందజేసే వినతులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరం క్యాంపు నిర్వహించి అర్హులైన దివ్యాంగులకు సర్టిఫికెట్ అందేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మండలం సుబ్బక్కపల్లి సర్పంచ్ తమ గ్రామంలోని పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేక ఇబ్బంది పడుతున్నామని, నిధులు కేటాయించి దారి నిర్మించాలని కోరారు. కరోనా మొదటి దశ సమయంలో స్థానిక ప్రభుత్వ దవాఖానలో బాధితులకు ఆహారం అందించానని, మరోసారి ఫుడ్ సర్వీస్కు అవకాశం కల్పించాలని భూపాలపల్లి పట్టణంలోని జవహర్నగర్కు చెందిన కప్పల రాజేశ్ వేడుకున్నాడు. మహాముత్తారం గ్రామంలో తన పేరున ఉన్న వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించుకున్నానని, తాగడానికి బోర్ వేసుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని జాడీ నాగయ్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. వీరితో పాటు సదరం సర్టిఫికెట్ కావాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని, భూ సమస్యలు పరిష్కరించాలని పలువురు దరఖాస్తు చేసుకున్నా రు. అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్ ఇచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రజావాణిలో పలు శాఖల అధికారులు, సిబ్బంది హాజరై వినతులు స్వీకరించారు.
వినతులు బాక్సులో వేయండి
ములుగుటౌన్, జనవరి17 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం వినతిపత్రాలు అందజేసేందుకు వచ్చే వారు ఇక నుంచి తమ విజ్ఞప్తులను బాక్సులో వేయాలని సూచించారు. సోమవారం పలువురి నుంచి వినతులు స్వీకరించారు.