వాజేడు , జనవరి 14: ములుగు జిల్లా వాజేడు మండలకేంద్రంతో పాటు మండలంలోని ప్రగళ్లపల్లి, మొరుమూరు కాలని, ఎడ్జర్లపల్లి, బొమ్మనపల్లి, ఆర్గుంటపల్లి, జగన్నాథపురం పేరూరు, పెద్దగోల్ల గూడెం తదితర గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీగా వడగండ్ల వాన కూరిసింది. రాళ్లతో కూడిన వర్షం భారీగా కురియడంతో మిర్చి పంటలు, మక్కజొన్న, పెసర, మినుము పంటలు దెబ్బతిన్నాయి. అకాలంగా మూడురోజులుగా కూరుస్తున్న వర్షానికి పంటలు దెబ్బతిని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాళ్ల వర్షం కురియడంతో ప్రజలు భయందోళన చెందారు.
గాలివానకు నేల వాలిన మిర్చి తోటలు
ఏటూరునాగారం: మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంట పాటు వీచిన గాలి, భారీ వర్షానికి మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఒక ఎత్తయితే శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం మిర్చి రైతులకు కన్నీరు తెప్పించింది. ఇప్పటికే కొంత మంది రైతుల మిర్చి కోత పట్టారు. భారీ వర్షానికి తోటల్లోకి వరద చేరి మోకాళ్ల లోతుతో నీరు నిలిచినట్లు రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు అల్లి శ్రీను తెలిపారు. మిర్చి పంటకు భారీ నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. పలు ఇండ్ల పరిసరాల్లోకి వరద చేరింది. రోడ్లపై వరద ప్రవహించింది.