పిల్లల కోసం ఆట వస్తువులు, బెంచీలు ఏర్పాటు చేయండి : కలెక్టర్ గోపి
తిమ్మాపురం, కోనాయిమాకుల గ్రామాల్లోని బృహత్ పల్లెప్రకృతి వనాల పరిశీలన
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచన
గీసుగొండ : బృహత్ పల్లె పకృతి వనాన్ని ఆహ్లాదకరంగా తయారు చేయాలని కలెక్టర్ గోపి అన్నారు. మండలంలోని కోనాయిమాకుల ఎస్సారెస్పీ కెనాల్ పక్కను ఏర్పాటు చేసిన బృహత్ పల్లె పకృతి వనాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 21 గ్రామాల ప్రజలకు సరిపడేలా పార్కు నిర్మాణం జరుగాలన్నారు. పిల్లల కోసం ప్రత్యేక ఆట వస్తువులు, బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు. 10 ఎకరాల్లో ఏర్పాటు చేసే పార్కులో అన్ని రకాల మొక్కలు ఉండాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగితేనే పనులు పూర్తవుతాయన్నారు. పార్కులో నీటి వసతి ఉండేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్కు జడ్పీటీసీ పోలీసు ధర్మారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
సంగెంలో..
సంగెం, జనవరి 8 : పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ గోపి అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో బృహత్ పల్లెప్రకృతి వనాన్ని శనివారం సందర్శించారు. పార్కులో నాటిన వివిధ రకాల మొక్కలను పరిశీలించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను దాతల ద్వారా స్వీకరించాలన్నారు. పార్కులో పూలు, పండ్ల మొక్కలను నాటాలన్నారు. చుట్టూ ఫెన్సింగ్, పార్కులోని పెద్ద పెద్ద బండరాళ్లపై డ్రాయింగ్ వేయించాలన్నారు. అనంతరం సంగెంలోని మసీద్ వద్ద నిర్మిస్తున్న సైడ్ కాల్వను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో ఎం సంపత్రావు, ఎంపీపీలు కందకట్ల కళావతి, భీమగాని సౌజన్య, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ గన్ను శారద, తహసీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీడీవో రమేశ్, ఏపీవో మోహన్రావు, ఎంపీవోలు కొమురయ్య, ప్రభాకర్, ఉపసర్పంచ్ సారంగం, ఏపీవో లక్ష్మి, కార్యదర్శి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.