జఫర్గఢ్, డిసెంబర్ 29 : చారిత్రక ప్రాంతమైన జఫర్గఢ్లో కొత్త రాతి యుగం నాటి గుర్తులు, బౌద్ధ స్తూపం, జైన దేవాలయ ఆధారాలు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. వాటి ఆనవాళ్లు, పరిసర ప్రాంతాల్లో లభించిన ఇతర చారిత్రక ఆధారాల వివరాలను ఆయన వివరించారు. జఫర్గఢ్కు పడమటి వైపు ఉన్న మాల్ల గుట్టకు మూడు వైపులా గ్రామ పెద్ద చెరువు ఉంది. గుట్ట దిగువన చెరువు వైపు ఎత్తయిన ఇటుక నిర్మాణం ఉంది. ఇటుక ముక్కలతో ప్రాంతమంతా ఎత్తయిన దిబ్బలా ఉంది. ఇటుకల నిర్మాణం ప్రసుత్తం ఉపయోగిస్తున్న ఇటుక కంటే పొడవు, వెడల్పులో చిన్నగా ఉన్న ఇటుకలతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. బౌద్ధ శిల్పాలకు ఉపయోగించే పాలరాతికి చెందిన అనేక చిన్న చిన్న పెచ్చులు లభించాయని, పాలరాయిని దిగుమతి చేసుకొని స్థానిక గుట్టపైనే శిల్పాలు చెక్కినట్లు తెలుస్తున్నదని పేర్కొన్నారు. తర్వాత కాలంలో ఈ స్తూపం వద్ద జైన దేవాలయం నిర్మించినట్లు తెలిపే ఆలయ స్తంభాలు, ఆధార పీఠాలు ఉన్నాయని చెప్పారు. జనగామ జిల్లాలోని కొన్నె, తాటికొండ, గూడూరుతో పాటు జఫర్గఢ్ ప్రాంతంలో బౌద్ధ స్తూపాలను వెలుగులోకి తెచ్చినట్లు చెప్పారు.
జగిత్యాలలోని బౌద్ధ స్తూపాలను తలపిస్తున్న మాల్చగుట్ట స్తూపం
జఫర్గఢ్లోని మాల్చ గుట్ట బౌద్ధ స్తూపం జగిత్యాల జిల్లాలోని మునుల గుట్టకు రెండో వైపు ఉన్న శిథిల బౌద్ధ స్తూపం పరిసరాలను తలపిస్తున్నట్లు రత్నాకర్రెడ్డి తెలిపారు. ఆ గుట్ట చుట్టూ ఉన్న రాతి నిర్మాణం జిల్లాలోని కొన్నె గ్రామంలో ఉన్న గజగిరి గుట్టపై, సూర్యాపేట జిల్లా ఈటూరులోని గాజులబండ బౌద్ధ స్తూపాల చుట్టూ ఉన్నట్లు వివరించాడు. గుట్ట దిగువన సప్త మాతృకలలో భాగంగా కనిపించే వారాహి శిల్పం విడిగా ఉండడం విశేషమని, శిల్పం పొట్ట నుంచి దిగువ భాగం వరకే ఉన్నదని తెలిపారు.
పర్యాటక కేంద్రంగా అనుకూలం
చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి జఫర్గఢ్ అనుకూలంగా ఉన్నదని రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. ఎన్నో చారిత్రక కట్టడాలు, ఆధారాలున్న ఈ ప్రాంతాన్ని పర్యాక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నాడు.