జనగామ, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు 51 మండలాలకు విస్తరించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ఆరు జిల్లాలుగా ఏర్పడింది. గతంలో జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ను కలువాలంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. జిల్లా పాలనాధికారిని కలిసే అవకాశం వచ్చినా ఒక్కోసారి వారి సమస్యలు చెప్పుకునే వీలుండేది కాదు. ప్రస్తుతం చిన్న జిల్లాల ఏర్పాటుతో దూరభారం తగ్గి ఉన్నతాధికారులను కలువడం సులభతరమైంది. పాలనను మరింత చేరువ చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాలను పునర్విభజించారు. దీంతో జనగామ జిల్లాగా ఏర్పడి ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సువిశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నూతన కలెక్టరేట్ను నిర్మించి పేదలకు పాలన మరింత చేరువ చేశారు. మూడు అంతస్తులతో విశాలమైన భవన సమూదాయం.. 31 శాఖల అధికారుల క్యాంపు కార్యాలయాలు.. రహదారులతోపాటు ఆకుపచ్చని ఆవరణ.. అందమైన గార్డెనింగ్.. హెలిప్యాడ్ సహా వాహనాలకు సెల్లార్ పార్కింగ్తో సకల సౌకర్యాలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) మెరిసిపోతున్నది. ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట ప్రజలకు అందించాలనే ధ్యేయంతో సూర్యాపేట రోడ్డులోని 25 ఎకరాల స్థలంలో రూ.54 కోట్ల వ్యయంతో 2017లో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. ఈనెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జిల్లా ప్రజలకు అంకితమిచ్చారు. 2016 అక్టోబర్ 10న కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లా కేంద్రంలో ప్రభుత్వశాఖల కార్యాలయాలు వేర్వేరుగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడేవారు.
అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాలు.. అధికారులు ఒకేచోట ఉండడంతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువకావాలనే సంకల్పంతో 2017 అక్టోబర్ 10న సమీకృత కలెక్టరేట్ భవనానికి నాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. తొలుత రూ.46 కోట్ల అంచనాతో ట్రాట్స్ అండ్ టవర్స్ కంపెనీ పనులు ప్రారంభించింది. సెల్లార్ పార్కింగ్ వంటి అదనపు నిర్మాణాలతో ప్రస్తుతం భవన నిర్మాణ వ్యయం రూ.54 కోట్లకు చేరుకున్నది. ఏడాదిలో పూర్తికావాల్సిన భవన సముదాయం కరోనా ప్రభావంతో కూలీల కొరత ఏర్పడింది. మరోవైపు భవిష్యత్లో ఎదురయ్యే పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య సెల్లార్ నిర్మాణం వంటి ఇతర ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు నిధుల కేటాయింపు ప్రక్రియ వంటి వివిధ కారణాలతో కొంత ఆలస్యమైంది. భవనంపైన రెండంతస్థులకు వెళ్లడానికి మూడు వైపులా మెట్లతోపాటు లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. అవసరాన్ని బట్టి మరిన్ని అంతస్తులకు పెంచుకునేలా ఏర్పాటు చేశారు. అధికారుల నివాస గృహాల సముదాయాన్ని సైతం జీ ఫ్లస్-2 విభాగంలో నిర్మాణం చేశారు. కలెక్టరేట్ ముఖద్వారానికి ఎదురుగా 70 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకం ఎగిరేలా ఏర్పాటు చేశారు. సమీకృత కలెక్టరేట్ చుట్టూ 30 ఫీట్ల రోడ్లు, జంక్షన్లు, పార్కులు నిర్మించారు. భవనం గ్రౌండ్ఫ్లోర్లో వంద వరకు వాహనాల పార్కింగ్కు సౌకర్యం కల్పించారు. బయటి నుంచి వచ్చే వారికోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారం నుంచి నాలుగు వరసల రహదారిని నిర్మించారు. ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఆవరణంతా పచ్చదనంగా మార్చారు.
సర్కారు సేవలన్నీ ఒకేచోట..
సమీకృత కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చాక జిల్లా ప్రజలకు 31 ప్రభుత్వశాఖల సేవలు ఒకేచోట లభించనున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ మున్సిపల్ కొత్త భవనం, ధర్మకంచ, వడ్లకొండ రోడ్డులోని ప్రభుత్వ భవనాల్లో వేర్వేరుగా కొనసాగుతున్నాయి. రెండు, మూడు శాఖల పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చే వారికి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో.. ఎంత దూరంలో ఉన్నాయో తెలియక ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వరంగల్-హైదరాబాద్ హైవేకు సమీపంలో సిద్దిపేట-సూర్యాపేట ప్రధాన రహదారిలో జనగామ బస్టాండ్కు సమీపాన సకల హంగులతో సమీకృత జిల్లా కార్యాలయాల సమూదాయాన్ని నిర్మించారు.
ఆకుపచ్చని ఆవరణం..
కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు సహా మరో నలుగురు జిల్లా అధికారులకు క్యాంపు కార్యాలయాలు(క్వార్టర్లు), భవనానికి అనుసంధానంగా హెలిప్యాడ్ నిర్మాణం సహా గార్డెనింగ్, హరితవనం, ఎలక్ట్రిఫికేషన్, ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు, రోడ్ల నిర్మాణం, ఫర్నిచర్, ప్రధాన గేటు నుంచి భవనం సహా క్వార్టర్స్ వరకు నాలుగు లైన్ల రోడ్డు, అంతర్గతంగా రెండు లైన్ల రోడ్లు, బయట గార్డెనింగ్ సహా భవనం లోపల ప్రతి అంతస్థులోనూ పచ్చదనంతో కనిపించేలా పూలమొక్కలు ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్లో మంత్రి చాంబర్
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనులు వేగంగా జరుగుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలోనే మంత్రి కార్యాలయం ఉండేలా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మంత్రులు జిల్లాల పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా ఆఫీసులు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. జిల్లా ప్రజలు మంత్రిని కలిసి అవసరమైన అంశాలపై దరఖాస్తు చేసేందుకు వీలుగా కార్యాలయం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గెస్ట్హౌస్ ఉన్నా కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినది కావడంతో పాతబడి ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవి నిరుపయోగంగా మారాయి.
చేరువైన పరిపాలన
జిల్లా ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం మెరుగైంది. అధికార యంత్రాంగం జిల్లాలోని ఆయా కుటుంబాల స్థితిగతులను నేరుగా తెలుసుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతమేరకు ప్రజలకు చేరుతున్నాయి..? ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయనే అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నది. 12 మండలాలతో ఆవిర్భావించిన జిల్లా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది. మండల అధికారుల నుంచి మొదలుకుని కలెక్టర్ వరకు గ్రామాల వారీగా ప్రతి చిన్న సమస్యను తెలుసుకుంటున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం-2018 అమల్లోకి రావడంతో తండాలు, శివారు గ్రామాలకు పంచాయతీ హోదా దక్కింది. గతంలో 193 గ్రామపంచాయతీలుండగా, కొత్తగా 88 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో జిల్లాలో వీటి సంఖ్య 281కి చేరింది. తొలిసారి జిల్లా పరిషత్ నెలకొల్పడంతో పరిపాలన వికేంద్రీకరణతో గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేస్తున్నది. అధికారులు సైతం నెలలో పలుమార్లు ఆయా గ్రామాలకు వెళ్తుండడంతో ప్రజలు అక్కడికక్కడే వారి సమస్యలు చెప్పుకుం టున్నారు. అధికారులు కూడా జవాబుదారీ తనంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. దీంతో అధికారులు విధి నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితులు తప్పనిసరయ్యాయి.