బచ్చన్నపేట, నవంబర్ 27 : సమాజంలో రోజు రోజుకు బంధాలు, బంధుత్వాలు పలుచబడుతున్న ఈ తరుణంలో పూర్వ విద్యార్థులు, తరతరాల కుటుంబాలు ఒక్క చోట కలుసుకుని ఆత్మీయ అనుభూతిని పొందుతున్న సంఘటనలు చూస్తున్నాం. అందులో భాగంగానే ఆదివారం మండలకేంద్రంలోని కొడవటూరులోని శ్రీనిధి గార్డెన్స్లో జనగామ పట్టణానికి చెందిన బుస్సా సిద్ధయ్య, వెంకటమ్మ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. అత్యంత ఆనందోత్సహాల మధ్య రోజంతా గడిపారు. మూడు తరాలకు చెందిన వారంతా కలిసి సుమారు 188మంది అయ్యారు. వారంతా ఒకే వేదిక మీదకు రావడంతో ఓ పండుగ వాతావరణం నెలకొంంది. సిద్ధమ్మ-వెంకటమ్మకు ఆరుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉండగా, వారి సంతానం కలిసి 188దాక అయ్యారు. వారంతా ఒక్కచోట కలుసుకుని ఆప్యాయతలు, అనుభూతులు పంచుకున్నారు. ఒకే రక్తం పంచుకున్న ఆ కుటుంబం ఒకచోటకు రావడంతో ఆ కుటుంబంలో సంబురాలు అంబరాన్నంటాయి. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ఆటపాటలతో హోరెత్తించారు. అనంతరం కుటుంబాల వారీగా గ్రూపు ఫొటోలు దిగారు. సహపంక్తి భోజనాలు చేసి ఆనందం పంచుకున్నారు. ఏదిఏమైనా మూడు తరాల కుటుంబం కలయిక మా జీవితంలో మర్చిపోలేని ఘట్టమని వారు వెల్లడించారు. కార్యక్రమంలో బుస్సా నాగమల్లయ్య, అల్లాడి మోహన్రావు, జిల్లా మల్లేశం, దాస బాబురావు, బుస్సా సిద్ధేశ్వర్, కంచర్ల సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.