వెంకటాపూర్, జూన్ 19: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘రామప్ప’ ఓ చారిత్రక ప్రదేశంగానే అందరికీ తెలుసు.. కానీ, ఇక్కడ మరో విశేషం ఉన్నది. ఆలయ పరిసరాల్లో అరుదైన కేన్ (చాపతీగ బరిగె) చెట్లు సుమారు 50 ఎకరాలకు పైనే విస్తరించి ఉన్నాయి. వాటి గురించి ప్రాముఖ్యత తెలిసిన వృక్షశాస్త్ర అధ్యాపకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించగా ఆ మొక్కలను తెలంగాణ సర్కారు సంరక్షిస్తున్నది.
వెంకటాపూర్ మండలం పాలంపేటలో రామప్ప ఆలయ సమీపాన అరుదైన కేన్ వృక్ష సంపద ఉంది. జీవవైవిధ్యానికి దోహదం చేసే ఈ మొక్కల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ మొక్కలు తెలంగాణలో మరెక్కడా లేవని తెలుస్తున్నది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు 51 ఎకరాల్లో కేన్ చెట్లు విస్తరించి ఉండేవి. తర్వాత అన్యాక్రాంతం కావడంతో కేవలం ఐదెకరాలకు తగ్గిపోయింది. అరుదైన మొక్కలు అంతరించి పోకుండా కాపాడాలని ములుగుకు చెందిన వృక్షశాస్త్ర పరిశోధకుడు సుతారి సతీష్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని సంరక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించారు. కేన్ మొక్కల ప్రాముఖ్యతను వివరించారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో అప్పటి టూరిజం మంత్రి అజ్మీరా చందులాల్ అన్యాక్రాంతమైన ఈ స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించగా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు మొత్తం 52 ఎకరాలను గుర్తించి చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేశారు. ఇది జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాంతమని తెలిసేలా అటవీశాఖ అధికారులు బోర్డు పెట్టారు. కేన్ చెట్లను కుర్చీలు, టీపాయిలు, సోఫాలు, ఊయలల తయారీలో వినియోగిస్తారు. కేన్ చెట్లు ఉన్న ప్రదేశంలో నేటికీ అడవి పందులు, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, ముంగీసలు, గబ్బిలాలు, రకరకాల పక్షులు, సీతాకోక చిలుకలు ఉన్నాయి. అరుదైన మద్ది, తాని, జమ్మి, పాలకొడిశె, తిప్పతీగ, తూటి తీగల తదితర వృక్ష, ఔషధ జాతి మొక్కలు కూడా ఉన్నాయి.
బయోడైవర్సిటీగా అభివృద్ధి చేయాలి
రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన తరుణంలో ఇదే తగిన సమయమని కేన్ చెట్లు విస్తరించి ఉన్న 51ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం సంరక్షించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించిన సందర్భంగా అరుదైన కేన్ మొక్కలు ఉన్న ఈ ప్రాంతాన్ని బయోడైవర్సిటీగా అభివృద్ధి చేస్తే పరిశోధకులకు, పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యా పర్యాటక ప్రాంతంగానూ రూపుదిద్దుకుంటుంది.
– సుతారి సతీష్,వృక్షశాస్త్ర పరిశోధకుడు