జనగామ, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : పాఠశాలల బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ప్రతి విద్యార్థికీ కేజీ టూ పీజీ విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యం వైపు దూసుకుపోతున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన, జిల్లాల పునర్విభజన తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ విద్య అంటే ప్రైవేటుకు పరిమితం అయితే ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో ప్రారంభించి కార్పొరేట్ స్థాయి చదువులు చెబుతున్నది. జిల్లాల పునర్విభజన తర్వాత జనగామ జిల్లాలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ స్థాయిలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఏటేటా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆమేరకు ఈ విద్యాసంవత్సరం నుంచి సంస్కరణల అమలుపై దృష్టిపెట్టింది.
ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకునేందుకు పూర్వ ప్రాథమిక తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేలా కార్యాచరణ ప్రారంభింది. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ఐదేళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించింది. గతేడాది అదనంగా మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటుతో పాటు జిల్లాలో 11 కేజీబీవీలు, 9 మోడల్ స్కూళ్లు, 7 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించింది. అలాగే కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లాకు కేంద్రీయ విద్యాలయం కూడా ఇటీవల మంజూరు కాగా, అందుకు అవసరమైన స్థలం గుర్తింపు కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ఆంగ్లమాధ్యమాన్ని అమలుచేస్తూ నాణ్యమైన విద్యాబోధనకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
అందుకు అనుగుణంగా పాఠశాలల ప్రారంభానికి ముందే ‘మన ఊరు-మన బడి’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించింది. ఆ తర్వాత ‘బడిబాట’ పేరిట పిల్లలను సర్కారు బడికి పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ నెల 13న(సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీ, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్, మైనార్టీ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో బోధిస్తున్నారు.
పంపిణీకి పుస్తకాలు సిద్ధం..
జిల్లాలో ప్రభుత్వ బడుల 645 ఉన్నాయి. అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 72,256. వీరికి మొత్తం 3.48 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం అవుతాయని అధికారులు లెక్కలు వేశారు. వీటిలో 1వ తరగతివి 14,130, 2వ తరగతివి 18,810, 3వ తరగతివి 21,480, 4వ తరగతివి 26,920, 5వ తరగతివి 29,528, 6వ తరగతివి 48,560, 7వ తరగతివి 45,610, 8వ తరగతివి 52,650, 9వ తరగతివి 45,573, 10వ తరగతి పాఠ్యపుస్తకాలు 45,080 అవసరం అవుతాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో టెక్ట్స్బుక్స్ ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వమే విద్యార్థులకు సరిపడా పుస్తకాలు ఉచితంగా అందిస్తుండడంతో ప్రైవేట్ సంస్థలు ముద్రణ తగ్గించాయి. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పుస్తకాలు ప్రైవేట్లో కొనాలంటే తల్లిదండ్రులకు భారం అవుతుంది. ఉదాహరణకు ప్రైవేట్లో ఆరో తరగతి పుస్తకాలు కొనాలంటే దాదాపు రూ.1,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి విడుతల వారీగా పాఠ్యపుస్తకాలు రానుండగా, ఇప్పటికే సుమారు 70వేల పుస్తకాలు ఆయా పాఠశాలలకు పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ గోదాములో భద్రపరిచారు. మిగిలిన అన్ని పుస్తకాలు పాఠశాలలు తెరిచే నాటికి జిల్లాకు చేరుకుంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.