జఫర్గఢ్, జూన్ 5: పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడుత పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం మండలంలోని తమ్మడపల్లి(ఐ), ఉప్పుగల్లులో ఆయన పర్యటించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో సంపత్రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొందన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ ఏర్పాటు చేమన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు గ్రామపంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ సమకూర్చడంతో పారిశుధ్యం బాగుందని సంపత్రెడ్డి తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 జాతీయ అవా ర్డుల్లో 19 ఆవార్డులు తెలంగాణకు దక్కడం ఇందుకు నిదర్శమని అన్నారు. పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, ఎంపీపీ రడపాక సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ ఎంపీపీ కనకయ్య, సర్పంచ్లు అనిత, సువర్ణ, నాయకులు నాయిని సురేశ్, జయపాల్రెడ్డి, కవితారెడ్డి, వివి ధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
నర్మెటలో..
నర్మెట : పల్లెప్రగతి పనులను విజయవంతం చేసేందుకు అధికారులు తమ వంతు కృషి చేయాలని ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్ అన్నారు. మండలంలోని మచ్చుపహాడ్, ఇసుకబాయితండా, నర్మెట గ్రామాల్లో కొనసాగుతన్న పల్లెప్రగతి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరించాలని కోరారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక యాప్లను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : పల్లెల సమగ్రాభివృద్ధితోపాటు పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎల్పీవో పార్థసారథి అన్నారు. ఆదివారం మండలంలోని తమ్మడపల్లి, చిన్నరామన్చర్ల, కట్కూర్ గ్రామాల్లో ఆయన పర్యటించి పల్లెప్రగతి పనులు పరిశీలించారు. శ్మశానవాటిక, డంపింగ్యార్డు, నర్సరీ, పల్లెప్రకృతి వనాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని వీధుల్లో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో వసతులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఊరు, వార్డును పరిశుభ్రంగా తీర్చి దిద్దాలన్నారు. ఎప్పటికప్పుడు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలను అందంగా తీర్చి దిద్దాలన్నారు.గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి కూల్చి వేయాలన్నారు. ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించి హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మేకల కవితారాజు, కలీల్బేగం, ముశిని సునీతారాజుగౌడ్, పంచాయతీ కార్యదర్శులు చక్రధర్, భాను, ప్రశాంత్ఆచార్య పాల్గొన్నారు.
రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి : పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మండల స్పెషల్ ఆఫీసర్ అశోక్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పల్లెప్రగతి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టాలని, గ్రామ పంచాయతికీ ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సంతోశ్, వార్డు సభ్యులు రామావారావు, నీలం వాసు, నరేశ్ పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సింగరాజుపల్లిలో పర్యటించి పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. మండల ప్రత్యేకాధికారి డీపీవో రంగాచారితో పాటు అధికారుల బృందం రామరాజుపల్లి, ధరావత్ తండా, ధర్మగడ్డ తండా, సింగరాజుపల్లి గ్రామాల్లో పర్యటించి గ్రామపంచాయతీలు అమలు చేస్తున్న పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ వీధులు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు శుభ్రం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజలింగం, విద్యుత్ శాఖ డీఈ సత్యనారాయణ, ఏపీవో శ్రీనివాస్, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
జనగామ రూరల్లో..
జనగామ రూరల్ : పల్లెప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మి తెలిపారు. మండలంలోని సిద్దెంకి, పసరమడ్ల, ఓబుల్ కేశ్వాపూర్, పెద్దరాంచర్ల, ఎల్లంల, వడ్లకొండ, అడవికేశ్వాపూర్ గ్రామాల్లో పల్లెప్రగతి పనులను, మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉప్పుగల్లు సంపత్కుమార్, సర్పంచ్లు సుంకరి నిర్మల, ఏళ్ల సుజాత, స్వప్న, రేణుక, శారద, జయరాం, సుజాత, గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.