జనగామ, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయం లో నంబర్వన్గా ఉంది.. వరి దిగుబడిలో యావత్ దేశంలోనే రాష్ట్రం రికార్డు సృష్టిస్తే.. అందులో జనగామ జిల్లా ఉమ్మడి వరంగల్లోనే మొదటి స్థానంలో నిలిచింది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు ఇది నిదర్శనం’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డు ఐ.ఈ.ఎస్ అధికారి జీఆర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామ సమీకృత కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, జిల్లాకోర్టు జడ్జి కే శైలజ, డీసీపీ సీతారాం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏడవెల్లి క్రిష్ణారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజయతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
పేదల సంక్షేమమే ఎజెండా..
అన్ని వర్గాల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే ఎజెండాగా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని జీఆర్ రెడ్డి అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన జిల్లాలో పకడ్బందీగా నిర్వహించి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశామని, రైతులకు రుణమాఫీ పథకం వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో రైతుబంధు పథకం కింద 1,62,180 మంది రైతులకు గానూ ఇప్పటివరకు 1,56,583 మందికి రూ.201. 07కోట్లు అందజేస్తున్నామని చెప్పారు. రైతు బీమా పథకం కింద 2021-22లో 337 మంది రైతు కుటుంబాలకు రూ.16.85కోట్లు అందజేశామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా సుమారు వందకోట్ల మేరకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు మెరుగయ్యాయని, అమ్మఒడి, కేసీఆర్ కిట్ పంపిణీతో ఎంసీహెచ్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు.
మిషన్ భగీరథ పథకం మారుమాల గ్రామాల ప్రజల పాలిట వరంగా మారిందని జిల్లాలోని గ్రామాలలో ఇంట్రా విలేజ్ సిస్టమ్ కోసం రూ.183.65కోట్ల అంచనాతో 443 వాటర్ ట్యాంకు లు, 1211.76 కిలోమీటర్ల అంతర్గత పైపులైన్లు పూర్తి చేసి 1,29,847 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చి రక్షిత నీరు అందిస్తున్నామని చెప్పారు. భగీరథ పథకంలో మరే ఇతర రాష్ట్రం సాధించని ఘనత తెలంగాణకు దక్కిందని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 2019లో కేంద్ర ప్రభుత్వ ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని ప్రారంభించిందని జీఆర్ రెడ్డి గుర్తుచేశారు. రూ.11.91 కోట్లతో 1,342 డీటీఆర్ ఏర్పాటుచేసి గిరిజన ప్రాంతాల్లో రూ.10.13కోట్లతో 3 ఫేస్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పల్లె ప్రగతి నాలుగు విడతల్లో జిల్లాలోని 281 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చుకున్నామని చెప్పారు. అలాగే పట్టణ ప్రగతి ద్వారా 2020-21, 2021-22 సంవత్సరాల్లో రూ.9.51కోట్లతో వరదనీటి కాల్వల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి, జేసీబీ, వైకుంఠ రథం కొనుగోలు, పార్కుల అభివృద్ధి, 5చోట్ల పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు అభివృద్ధి, జంక్షన్ల అభివృద్ధి, వర్మీ కంపోస్టు షెడ్లు పూర్తి చేసుకున్నామని తెలిపారు.
టీయూటీఎఫ్ఐడీసీ ద్వారా రూ.30కోట్లతో జిల్లాకేంద్రంలో నాలుగు ప్రధాన రహదారుల సుందరీకరణ, సెంట్రల్ ఎల్ఈడీ లైటింగ్ పనులు పూర్తి చేశామన్నారు. వెజ్, నాన్వెజ్ మోడల్ మార్కెట్ నిర్మాణం కోసం రూ.6.50 కోట్లు కేటాయించి పనులు జరుగుతున్నాయని, రూ.కోటితో హనుమకొండ రోడ్డులో వైకుంఠధామం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో అర్హులైన 65వేల 159 మందికి ప్రతినెలా రూ.15.56కోట్ల పింఛన్లు ఇస్తున్నామని, అందులో 22,306 వృద్ధులు, 1,466 మంది చేనేత కార్మికులు, 10,414మంది దివ్యాంగులు, 23,824 మంది వితంతువులు, 2,008 మంది బీడీ కార్మికులు, 2,738 మంది కల్లు గీత కార్మికులు, 1,485 మంది ఒంటరి మహిళలు, 404 మంది ఆర్ట్/ఏడ్స్, 514 మంది ఫైలేరియా పించన్దారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో రూపాయి కిలో బియ్యం అందిస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం కింద బియ్యం, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా ఆయా వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని, ఓవర్సీస్ పథకం కింద విదేశాలలో చదివే వారికి రూ.20లక్షలు, ప్రయాణ సౌకర్యం కోసం రూ.33, 500 మంజూరు చేశామని తెలిపారు. విద్యార్ధులకు స్కాలర్షిప్లు, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకం, బ్యాంకు రుణాల మంజూరు చేశామని ఆయన తెలిపారు. జిల్లాలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 656 ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 24,905 మంది పిల్లలు, 6788 మంది గర్భిణులు, బాలితలకు ఆరోగ్యలక్ష్మి కింద ఒకపూట సంపూర్ణ భోజనంతో పాటు 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన గుడ్లు ప్రతిరోజు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటివరకు 6,862 ప్రసవాలు జరిగితే 3,967 మందికి కేసీఆర్ కిట్లు అందించామని ప్రభుత్వ సలహాదారు జీఆర్రెడ్డి తెలిపారు.
నేరవేరని కేంద్ర ప్రభుత్వ హామీలు..
దురదృష్టవశాత్తు కేంద్రం నుంచి మన రాష్ర్టానికి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఫైనాన్స్ కమిషన్లు సిఫార్సు చేసిన గ్రాంట్లలో తెలంగాణకు రావాల్సిన వాటాను నిరాకరిస్తున్నదని ప్రభుత్వ సలహాదారు జీఆర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలకు సహాయం చేయాల్సిన కేంద్రం చట్టంలో పేర్కొన్న ప్రకారం గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీలను నెరవేర్చలేదన్నారు. చట్ట ప్రకారం తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే చేయూత నామమాత్రమేనని, నీతి అయోగ్, మిషన్ భగీరథకు రూ.19,205, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు సిఫార్సు చేసినా గ్రాంట్లు ఇచ్చేందుకు కేంద్రం నిరాకరిస్తున్నదని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.1,350కోట్ల విడుదల చేయాల్సి ఉందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏ.భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, జడ్పీటీసీ నిమ్మతి దీపిక పాల్గొన్నారు.