దేవరుప్పుల, మే 16 : పదో తరగతి పూర్తయ్యే లోపే విద్యార్థుల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా వారు స్వయంఉపాధి పొంది జీవితంలో స్థిరపడుతారనే లక్ష్యంతో పాఠశాల స్థాయిలోనే ఈ కోర్సులు ప్రారంభించనుంది. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని సదుపాయాలున్న 18 ఉన్నత పాఠశాలలను ఎంపికచేసి వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుచేయనుంది. మరుసటి విద్యాసంవత్సరంలో మరో 15, ఇలా 2030 నాటికి ప్రతి ఉన్నత పాఠశాల విద్యార్థికి అందించేలా ప్రణాళిక సిద్ధంచేసింది.
ఉమ్మడి జిల్లాలో అమలయ్యే పాఠశాలలివే..
ఉమ్మడి జిల్లాలో 18 పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకేషనల్ ఎడ్యుకేషన్ హబ్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. జనగామ జిల్లాలో ధర్మకంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాలకుర్తి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల నరేంద్రనగర్, జడ్పీఎస్ఎస్ నర్సంపేట, జడ్పీఎస్ఎస్ కొత్తూరు, ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జడ్పీఎస్ఎస్ జంగేడు, జడ్పీఎస్ఎస్ గొల్లబుద్దారం, జడ్పీఎస్ఎస్ తాడిచర్ల, హనుమకొండ జిల్లాలో మర్కజీ ప్రభుత్వ పాఠశాల, జడ్పీఎస్ఎస్ ధర్మసాగర్, జడ్పీఎస్ఎస్ గట్లనర్సింగాపురం, మహబూబాబాద్ జిల్లాలో జడ్పీఎస్ఎస్ తొర్రూరు, జడ్పీఎస్ఎస్ సీతారాంపురం, మహబూబాబాద్ జడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. ప్రాథమికంగా అత్యధిక విద్యార్థులు, పట్టణ స్థాయి, స్థానికంగా సంబంధిత పరిశ్రమల వసతులు, విశాలమైన తరగతి గదులు, పూర్తిస్థాయి మౌలిక వసతులున్న పాఠశాలలను ఎంపిక చేశారు. వీటికి ఒకేషనల్ ఎడ్యుకేషన్ హబ్లుగా నామకరణం చేసి వృత్తి విద్యాకోర్సులను ప్రత్యేక తరగతులుగా ప్రారంభిస్తారు.
జిల్లాలో కోర్సుల ఎంపిక
యువతులకు ఉపయోపడే బ్యూ టీషియన్ కోర్సు, ఎక్కువగా ప్రాచు ర్యం ఉన్న ఎలక్ట్రీషియన్, డీటీపీ ఆపరేటర్ కోర్సులను ఎంపిక చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10 తరగతుల వారికి విధిగా వృత్తి విద్యాకోర్సులను ప్రత్యేక తరగతుల్ల్లో బోధిస్తారు. కాగా ఈ విద్యార్థులకు ప్రాక్టికల్స్, పరిశ్రమల క్షేత్ర సందర్శన ఉంటాయి. విద్యాసంవత్సరం పూర్తయే నాటికి విద్యార్థి చేస్తున్న కోర్సులో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దుతారు.
ఇదే పాఠశాలల్లో యువతకు సమ్మర్ క్లాసులు
ఒకేషనల్ కోర్సులు కొనసాగుతున్న పాఠశాలలో దీనికి అనుసంధానంగా వేసవి కాలంలో పాఠశాల ఉన్న గ్రామాలతో పాటు చుట్టుపక్కన ఉన్న గ్రామా ల నిరుద్యోగ యువతకు వృత్తివిద్యలో 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులకు నెలకు రూ.3వేల ైస్టెఫండ్ వస్తుందని అధికారులు తెలిపారు. శిక్షణ పూర్తి చేసి నైపు ణ్యం సాధించిన వారికి స్వయంఉపాధితో పాటు పలు కంపెనీల్లో పనిచేసే అవకాశం కల్పిస్తారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ధర్మకంచె, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి ఉన్నత పాఠశాలల్లో ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. విద్యార్థి దశ నుంచే వారికున్న నైపుణ్యానికి తగ్గట్టు వృత్తుల్లో ప్రావీణ్యం సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా ఒకేషనల్ కోర్సులు ఉంటాయి.
– శ్రీనివాస్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, జనగామ జిల్లా