వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు
జిల్లాలో సమగ్ర రైతు సర్వే
పంట కాలనీలపై ప్రత్యేక కార్యాచరణ
జనగామ, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు పంటల సాగులో నూతన ఒరవడి సృష్టిస్తున్నది. రైతులను ఆదుకునేందుకు ఎకరాకు ఏడాదిలో రూ.10 వేలు అందిస్తున్నది. ఎగువ ప్రాంతాలకు గోదావరి జలాలు అందించడతోపాటు వ్యవసాయ పంపుసెట్లకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నది. ఫలితంగా జిల్లాలో సాగు విస్తీర్ణం 3,60, 952 ఎకరాలకు పెరిగింది. పంటకాలనీల ఏర్పాటుపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. భూమి లక్షణాలు, వాతావరణ పరిస్థితులు, సాగునీటి వసతితోపాటు మార్కెటింగ్ సౌకర్యం వంటి 39 అంశాలపై రైతు వారీగా వివరాలు సేకరించింది. దిగుబడులకు అనుగుణంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నది.
రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో టీఆర్ఎస్ సర్కారు సరికొత్త పథకాలు అమలు చేస్తున్నది. పంట కాలనీల ఏర్పాటుతో వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నారు, భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రైతన్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే లా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. సమగ్ర కుటుంబ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన తరహాలో వ్యవసాయ రంగంపై సర్వే చేయించిన సర్కారు రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం జిల్లాలో భూమి లక్షణాలు, వాతావరణ పరిస్థితులు, సాగునీటి వసతితోపాటు మార్కెటింగ్ సౌకర్యం వంటి 39 అంశాలపై రైతు వారీగా గణన చేపట్టి పంటకాలనీల ఏర్పాటుపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో సాగువుతున్న పంటల వివరాలు, రైతు లు, ఆయా రకం పంటల వారీగా ప్రత్యేక ఫార్మట్లో ప్రత్యామ్నాయ పంటలపైనా ఆలోచన చేయడం, ఈ ప్రాంతంలో సాగు చేసే, అధిక దిగుబడులు వచ్చే పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టే దిశగా ముందుకు సాగుతున్నది. లాభాల సాగుకు రైతులను ప్రత్యామ్నాయ పం టల సాగు వైపు మళ్లించి అండగా నిలిచేందుకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగ స్వరూపాన్ని మా ర్చేందుకు మూస పద్ధతుల్లో నడుస్తున్న ప్రస్తుత సేద్యపు అలవాట్ల నుంచి రైతులను ఆధునికం వైపు నడిపించే బృహత్తర పథకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2,96, 262 ఎకరాలు కాగా, ఇందులో సాగు విస్తీర్ణం 3,60, 952 ఎకరాలుంది. ప్రధాన పంటలుగా వరి, పత్తి, మక్కజొన్న, కంది, వేరుశనగ సాగుచేస్తున్నారు. కిందటేడాది వానకాలంలో 1.05 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేస్తే.. పంటపెట్టుబడి సాయం పథకంతో ఈసారి 1.08 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. జిల్లాలో గత ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 2.63 లక్షల మెట్రిక్ ట న్నుల ధా న్యం పండింది. ఇందులో ప్రభుత్వరంగ సంస్థ లే 2,39, 899 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశా యి.
39 అంశాలపై రైతు సర్వే..
పంట కాలనీల ఏర్పాటుకు సంబంధించి జిల్లాలోని రైతుల వివరాల కోసం 39 అంశాలతో కూడిన సర్వే ఫ్రొఫార్మాను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించగా, జిల్లా అవసరాలకు కావాల్సిన అంశాలను స్థానికంగా ముద్రించే ప్రక్రియ చేపట్టారు. సర్వేలో తేలిన అంశాల ఆధారంగా జిల్లాలో ఎంఏవోలు, ఏడీఏలు, డీఏవోల పర్యవేక్షణలో రూపొందించిన నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు నెలకొల్పాలనే నిర్ణయం తీసుకుంటారు.
పంట కాలనీలు..
రైతులు తనకు ఇష్టమైన పంట వేసుకుని దిగుబడి వచ్చాక దాన్ని అమ్ముకునేందుకు పడుతున్న ఇబ్బందులు, మార్కెట్లో అడ్డగోలు దోపిడీతో నష్టపోకుండా ఉండేందుకు క్రాప్ కాలనీల ఏర్పాటుకు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత ఏడాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పంటల కాలనీలను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే విధానం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఒక ప్రాంతంలో రైతులు ఎక్కువగా పండించే పంటలను సర్వే చేసిన తర్వాత వాటికి అనుబంధం ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే ప్రక్రియను చేపట్టాలన్నది ప్రణాళిక. పంట కాలనీల కోసం చేపట్టే సర్వేలో వ్యవసాయశాఖ అధికారులు అన్ని వివరాలను సేకరించారు. ప్రధానంగా సర్వేలో రైతు పట్టాదారు పాస్ పుస్తకం నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, సామాజిక స్థితి, రైతు భూమి విస్తీర్ణం, నీటి పారుదల వసతి, భూమి స్వభావం, వానకాలం, యాసంగిలో పండించే పంటల వివరాలు, మార్కెటింగ్ సౌకర్యం, రైతులు తీసుకునే రుణం, పంటలకు బీమా వివరాలు, రైతు కుటుంబంలో స్వయం సహాయక సభ్యులు, గ్రూపుల వివరాలను సేకరించారు. అంతేకాకుండా రైతులకున్న పశువుల సంఖ్య, సేంద్రియ వ్యవసాయంపై వారికి అవగాహన ఉందా? అనే వివరాలతోపాటు ఈప్రాంతంలో ఏ ప్రాసెసింగ్ యూనిట్కు అనువుగా ఉంటుందనే అభిప్రాయాలను సైతం రైతుల నుంచి సేకరించారు.