బచ్చన్నపేట, నవంబర్ 17 : వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఫోరం ప్రతినిధులు కే తిరుమల్రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమావేశానికి వివిధ గ్రామాల నుంచి రైతులు హాజరై సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా తిరుమల్రావు మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కరంట్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, మీటర్ సమస్య, ఎక్కువ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లలో ఓవర్లోడ్తో దగ్ధమవడం, బిల్లుల పేరులో మార్పు, స్తంభాల మార్పు, లూజ్లైన్లు వంటి సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించాలన్నారు. వీటిని వెంటనే పరిష్కరించకుంటే సంబంధిత అధికారికి జరిమానా విధించి వాటిని వినియోగదారులకు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో రూ.3 లక్షల జరిమానాలు సంబంధిత అధికారులకు విధించి వాటిని బాధిత రైతులకు అందజేశామన్నారు. బచ్చన్నపేటలో సైతం ఏఈ, ఏడీఈ కి రూ.6 వేలు ఫైన్ వేశామని తిరుమల్రావు చెప్పారు. ఎంతటి అధికారి అయినా ఫోరం ముందు సమానమేనన్నారు. వి ద్యుత్ మీటరు, కేటగిరీలో మార్పు, ఓవర్లోడ్ సమస్యలపై అధికారులు స్పందించకుంటే తమకు 9440811299 ఫోన్, వాల్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఈ సమావేశలో ఫోరం ప్రతినిధులు చరణ్దాసు, నరేందర్, జనగామ ఎస్ఈ మల్లికార్జున్, డీఈ సదానందం, ఏడీఈ అర్జున్పమార్, ఏఈ సత్తయ్య పాల్గొన్నారు.