బచ్చన్నపేట, నవంబర్ 10 : రైతును రాజు చేయడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు పథకంలో ఎకరాకు ఏటా రూ.10 వేలు అందిస్తున్నది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ను ఉచితంగా సరఫరా చేస్తున్నది. మరోవైపు రైతుబీమా పథకంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు సాయం చేస్తున్నది. రైతు సహజ మరణం చెందినా 15 రోజుల్లో బీమా డబ్బులు నామినీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రతి ఏటా రైతులకు రూ.3487 ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కంపెనీకి ప్రభుత్వమే చెల్లిస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది 68 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలకు రూ.3.40 కోట్లు సాయం అందించారు. మిగిలిన 53 కుటుంబాలకు త్వరలో అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పంట పండించింది మొదలు దిగుబడి వచ్చాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సర్కారు కొనుగోలు చేస్తూ మద్దతు ధర అమలు చేస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతును రాజు చేయడమే ధ్యేయం
రైతన్నల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎవుసం చేసే ప్రతి రైతు ఆర్దికంగా ఎదిగేందుకు ప్రోత్సాహమిస్తున్నారు. రైతు బాగుంటేనే ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటుందన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది. గుంట భూమి ఉన్న రై తుకు సైతం రైతుబీమా పథకం వర్తింప చేస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు 15 రోజుల్లోనే నామినీ ఖాతాలో రూ.5 లక్షల భీమా సాయం జమ చేస్తున్నది. రైతు మరణించిన సమాచారాన్ని సంబందిత క్లస్టర్ ఏఈవోకు తెలియజేస్తే మృతుడికి సంబంధించిన బీమా పత్రం, నామినీ బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు, పట్టాదారు పుస్తకం వివరాలను సేకరిస్తారు. ఆన్లైన్లో ఆ పత్రాలను స్కాన్ చేసి సంబంధిత వ్యవసాయ ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. దీంతో బీమా సొమ్ము 15 రోజుల్లో నామినీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఫలితంగా మృతుల ఆర్థిక భరోసా లభిస్తుంది.
నాలుగేండ్లలో 1,558 మంది రైతు కుటుంబాలకు సాయం.
జిల్లాలోని 12 మండలాల్లో వివిధ కారణాలతో నాలుగేళ్లలో 1,664 మంది రైతులు మృతి చెందారు. వీరిలో 1,558 మందికి బీమా డబ్బులు అందాయి. మిగిలిన 106 మందికి త్వరలో అందించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 2018లో 376 మందికి గాను రూ.18.80 కోట్లు, 2019లో 465 మందికి గాను రూ.22.55 కోట్లు, 2020లో 649 మందికి గాను రూ.32,45 కోట్లు, 2021లో 68 మంది కుటుంబాలకు రూ.3.40 కోట్ల బీమా డబ్బులను సర్కారు అందించింది.
పకడ్బందీగా రైతుబీమా అమలు.
రైతుబీమా పథకం పకడ్భందీగా అమలు చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 1664 మంది మృతి చెంద గా, వీరిలో 1558 మందికి బీమా వర్తింప చేశాం. మిగిలిన వారికి త్వరలో అందేలా చర్యలు తీసుకుంటున్నం. ప్రభుత్వమే ప్రతి ఏడాది బీమా ప్రీమియం చెల్లిస్తూ సాయం చేస్తున్నది. రైతు మరణించిన 15 రోజుల్లోనే డబ్బులందేలా చర్యలు తీసుకుంటున్నం. పైరవీలకు తావు లేకుండా నేరుగా రైతుబీమా చెక్కులు నామిని పేర బ్యాంకులో జమ చేస్తున్నం..
-రాధిక, జిల్లా వ్యవసాయాధికారి, జనగామ