గంగారం, నవంబర్ 8: పోడు వ్యవసాయం చేసుకుంటున్న, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం హక్కు పత్రాలు అందించే దిశగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం గంగారం మండలం కొడిశాలమిట్ట గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పోడుభూములు, అటవీ సంరక్షణ ఎఫ్ఆర్సీ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పం చ్ పుల్సం లక్ష్మి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సన్మానించి, స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్థానిక ప్రజలతో మాట్లాడారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు ఈ నెల మొదటి వారం నుంచి తమ గ్రామాల్లో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు పూర్తి చేసేందుకు కమిటీలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అం దుబాటులో ఉంటారని తెలిపారు. హక్కు పత్రాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే అధికారులకు సమాచారం అందించాలన్నారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని, ఎవరూ చెట్లను నరికి కొత్త పోడు వ్యవసాయం చేయొద్దని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూమి సర్వేయర్ను త్వరలో నియమిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హక్కు పత్రాలు పొందిన భూముల్లో విద్యుత్ తీగలు, బోరు బావులకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దిలీప్కుమార్, తహసీల్దార్ సూర్యనారాయణ, డిటీ నరేశ్, ఎంపీడీవో శ్యాంసుందర్, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ వీరభద్ర, జడ్పీటీసీ రమ, సీపీఐ నాయకులు భూర్క వెంకటయ్య, సర్పంచ్ సారక్క, రైతులు పాల్గొన్నారు.
రైతులను తప్పుదోవ పట్టిస్తే చర్యలు
మహబూబాబాద్ : పోడు రైతులను తప్పుదోవ పట్టిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ కే శశాంక ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేర కు జిల్లాలోని 164 గ్రామ పంచాయతీలు, 340 ఆవాసాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మండల స్థాయిలో ఎఫ్ఆర్వో, తహసీల్దార్, ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారుల కమిటీ ఉంటుందని, దరఖాస్తు ఫారాలను జిల్లా స్థాయిలో ముద్రించి జీపీల ద్వారా పంపిణీ చేస్తామన్నా రు. దరఖాస్తులు పూర్తిచేసే క్రమంలో డబ్బులు వసూలు చేయొద్దని, అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. పోడు సమస్యలను పరిష్కరిస్తూనే అడవులను రక్షించుకోవడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. కొత్తగా కొట్టుకున్న పోడు భూములకు అనుమతులు వర్తించవని, రైతులకు ఎలాంటి సందేహాలున్నా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్లు 08719-240400, 7995074803లకు మెసేజ్ చేయవచ్చని వివరించారు.
కొత్తగూడ: పోడు సాగుచేసుకునే రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శశాంక్ అన్నారు. సోమవారం గంగారం, కొత్తగూడ మండలాల్లో ఆయన పర్యాటించారు. అవాసాల వారీగా ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమాల్లో మాట్లాడారు. తరతరాలుగా పోడు సాగుచేసుకుంటున్న వారు ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని, కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. లేకపోతే మండల, జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. గిరిజనేతరులు 90 సంవత్సరాలుగా, 1930 నుంచి పోడు సాగుచేస్తున్న వారు అర్హులన్నారు. అనంతరం పోలారంలో పోడు భూములు, అటవీ సంరక్షణ సమావేశంలో పాల్గొన్నారు. 24 గ్రామపంచాయతీలు 53 ఆవాసాల్లో గ్రామ కమిటీలు దరఖాస్తు సేకరించడమే కాక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధ్ధి అధికారి దిలీప్కుమార్, కొత్తగూడ మండల ప్రత్యేకాధికారి సూర్యనారాయణ, తహసీలార్లు సూర్యనారాయణ, నరే శ్, ఎంపీడీవోలు శ్యాంసుందర్, కరణ్సింగ్, ఎఫ్బీవో ఆదినారాయణ, గ్రామకమిటీ చైర్మన్లు భిక్షం, నర్సయ్య, పులసం లక్ష్మి, సెక్రటరీలు గణేశ్, స్వరూప పాల్గొన్నారు.