లింగాలఘనపురం, నవంబర్ 7 : తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందని, ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విండో అధ్యక్షుడు ఎం శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది కేసీఆరేనన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ వాటిని పట్టించుకోకుండా రాష్ట్రంలో రైతులకు అవసరమున్నన్ని కొనుగోలు కేంద్రాలను మంజూరు చేస్తున్నారన్నారు. ఈ మండలంలో అదనంగా ఆరు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతును రాజును చేయడమే ధ్యే యంగా పని చేస్తున్న కేసీఆర్ వెంటే ఎల్లవేళలా రైతులున్నారన్నారు. రైతులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రతి గింజా కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం బండ్లగూడెంలో నిర్వహించిన దుర్గామాత ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్గౌడ్, విండో చైర్మన్లు ఎం శ్రీశైలం, బీ ఉపేందర్గౌడ్, నాయకులు గవ్వల మల్లేశం, భాగ్యలక్షి, కే శ్రీపాల్రెడ్డి, గండి యాదగిరి, గట్టగల్ల శ్రీహరి, బీ రాజేశ్వర్గైడ్, కే విజయకుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.