జనగామ రూరల్, ఆగస్టు 7: జనగామ పట్టణంలోని దళితులు, గిరిజనుల కాలనీల్లో మౌలిక సదుపాయాల వివరాలను సేకరించాలని అదకపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. శనివారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలోని సమావేశపు హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్లోని వివిధ విభాగాల అధికారులు, వార్డుల ప్రత్యేక అధికారులు, ఆర్పీలకు పలు సూచనలు చేశారు. హమీద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దళితులు, గిరిజన కుటుంబాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని కోరారు. వారు నివసిస్తున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదికను నమూనా ఫారాల్లో సమర్పించాలన్నారు. పట్టణంలోని 30 వార్డులకుగాను మూడు బృందాలను ఏర్పాటు చేశామని హమీద్ వివరించారు. ఈ బృందాలు రోజుకు రెండు వార్డుల చొప్పున ఐదు రోజుల్లో అన్ని వార్డుల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతి వార్డులో యూత్, మహిళ, సీనియర్ సిటిజన్తో నాలుగు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున సభ్యులుంటారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం బృందం సభ్యులంతా ఉదయం 7గంటలకల్లా వార్డుల్లో క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. దళిత, గిరిజన కుటుంబాల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ఆయా వార్డుల్లో డ్రైనేజీలు, సీసీరోడ్లు, తాగునీటి కనెక్షన్లు, విద్యుత్ సరఫరా, ఎల్ఈడీ వీధి దీపాలు వివరాలను నమూనా ఫారాల్లో సమర్పించాలన్నారు. వార్డు కమిటీల సభ్యులను ఇందులో భాగస్వాములను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీవో రాంరెడ్డి, జనగామ మున్సిపల్ కమిషనర్ నరసింహ, వార్డు ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.