పప్పుదినుసుల సాగుతో సిరులు
చెరువులు, బావుల నిండా గోదావరి నీళ్లు
నర్సింహులపేట, ఏప్రిల్ 30 : గతంలో మహబూబాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు నీరు లేక రైతులు దూరంగా ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, కాలువల ద్వారా గోదావరి నీటిని తరలించి గ్రామాల్లోని చెరువులు చెరువులు, కుంటలు నింపడంతో రైతులు తిరిగి యాసంగి సాగువైపు మళ్లారు.
మండే ఎండల్లోనూ ఇప్పుడు మూడో పంట పండిస్తూ సిరులు పొందుతున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు వానకాలం, యాసంగి సాగు లెక్కలే వేశారు. ఇక నుంచి మూడో పంట సాగు విస్తీర్ణాన్ని కూడా రికార్డుల్లోకి ఎక్కించనున్నారు. ఈ మూడో పంటలో జిల్లా వ్యాప్తంగా 15 వేల 670 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో పెసర 2, 500 ఎకరాలు, పల్లి 3,500 ఎకరాలు, మినుములు 1500 ఎకరాలు, నువ్వులు 350 ఎకరాలు, మక్క 6,500 ఎకరాలు, బబ్బెర్లు 970 ఎకరాలు, శనగ 50 ఎకరాలు, పుచ్చ, కూరగాయాలు 300 ఎకరాల్లో సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
నీటి లభ్యత వల్లే మూడో పంట
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగునీటిని పుష్కలంగా అందిస్తున్నది. చెరువులు, బావులు నీటితో కళకళలాడుతున్నాయి. బోర్లు కూడా వానకాలాన్ని తలపించేలా పోస్తున్నాయి. అందుకే ఈసారి మూడో పంట కింద పల్లి సాగు చేస్తున్న. వానకాలంలో నాలుగు ఎకరాల్లో పెసర, యాసంగిలో నాలుగు ఎకరాల్లో పల్లి, మూడోపంటగా రెండు ఎకరాల్లో పల్లి వేసిన.
సాగునీటికి ఢోకాలేదు
మాకు వ్యవసాయమే జీవనాధారం. వానకాలం, యాసంగి తేడా లేకుండా పంటలు సాగు చేస్తున్నం. రాష్ట్ర సర్కారు కరంటు సమస్య లేకుండ చర్యలు తీసుకోవడం, ఆకేరువాగు నిండా నీరుండడంతో పంటలకు ఢోకా లేకుండ పోయింది. పుష్కలంగా నీళ్లుండడంతో మూడో పంట కూడా పండిస్తున్నం.