ఓ పట్టణంలోని ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్న ఫొటోస్టాట్ అంగడి అది. దాన్ని భార్యాభర్తలిద్దరూ ఎంతో జాగ్రత్తగా నడిపించేవారు. ఎన్నాళ్లుగానో ఏదైనా గుడికి తమ శక్తి కొద్దీ సేవ చేస్తే బాగుంటుందని అనుకునేవారు. అయితే ఏ సేవ చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అదే అంగడిలో పనిచేసే ఒక అమ్మాయి, జిరాక్స్ తీసేటప్పుడు మిగిలిపోయే తెల్ల కాగితాలను యజమానిని అడిగి తీసుకుని వెళ్తుండేది. చాలా సందర్భాల్లో ఆ అమ్మాయితో అంగడి యజమానులు, ‘కాగితాలన్నీ పోగు చేసి పాత కాగితాల అంగడివాళ్లకు అమ్ముకుంటున్నావా?’ అని కొంచెం గేలిగా అనేవాళ్లు.
ఆ అమ్మాయి మాత్రం కేవలం నవ్వి ఊరుకునేది. ఓ ఆదివారం రోజు కృత్తిక నక్షత్రం కావడంతో, అంగడి యజమానులు సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక, గుడి పూజారి వారి చేతిలో విభూతి పెట్టాడు. వారు దాన్ని ఎంతో భక్తితో స్వీకరించి నుదుటన పెట్టుకున్నారు. మిగిలిన విభూతిని కాగితంలో పొట్లం కట్టుకుని ఇంటికి తీసుకుపోదామని చూశారు. కానీ, వారి దగ్గర కాగితం ఏదీ కనిపించలేదు. అదే సమయంలో దూరంగా ఒకామె భక్తులకు విభూతి కట్టుకోవడానికి కాగితాలు ఇస్తూ కనిపించింది. వారు ఆమె దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ ఉన్నది తమ అంగడిలో పనిచేసే అమ్మాయే! దంపతులు ఆశ్చర్యపోయారు.
ఆ అమ్మాయి నవ్వుతూ, నేను మన అంగడిలో మిగిలిన కాగితాలను తీసుకువచ్చేది ఇలా విభూతిని పొట్లం కట్టుకోవడానికే. గుడికి వచ్చే చాలామంది కాగితాలు తెచ్చుకోరు. మిగిలిన విభూతిని ఏం చేయాలో తెలియక, పక్కనున్న గోడల మీద, రాతి విగ్రహాల మీద పోసి వెళ్లిపోతుంటారు. అందుకే ప్రతి ఆదివారం నేనిక్కడికి వచ్చి, నా శక్తికి తగిన ఈ చిన్న సేవ చేస్తున్నాను అని చెప్పి వారికి ఒక కాగితం ఇచ్చింది. ‘అయ్యో! మనం ఎన్నాళ్లుగానో ఏదైనా సేవ చేద్దామని అనుకుంటూ వాయిదాలు వేస్తున్నామే! భక్తికి శక్తి అవరోధం కాదు కదా. చేసే సేవ చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా ఏదో ఒక సేవ మొదలుపెడితే మంచిది’ అని ఆ దంపతులు గ్రహించారు. వెంటనే వారు ఆ గుడికి ఒక తాగునీటి శుద్ధి పరికరాన్ని విరాళంగా అందించారు.
-ఆర్సీ కృష్ణస్వామి రాజు ,93936 62821