వరంగల్, ఫిబ్రవరి 14(నమస్తేతెలంగాణ) : ఆసియాలోని అతి పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఎనుమాముల రెండోది. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు రావడం ఈ మార్కెట్ స్పెషల్. ఇతర వ్యవసాయ మార్కెట్లలో కొన్నింటికి మిర్చి, పసుపు, మక్కలు, మరికొన్నింటికి పత్తి, అపరాలు, ఇంకొన్నింటికి కేవలం పసుపు లేదా మిర్చి, పల్లికాయ మాత్రమే వస్తుండగా ఎనుమాముల మార్కెట్కు పత్తి, మిర్చి, మక్కలు, కందులు, జొన్న, పల్లికాయ, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆలుచందలు, శనిగలు, పసుపు వస్తున్నాయి. ఈ ఏడాది మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ మంచి ధర లభిస్తున్నది. ప్రధానంగా పత్తి, మిర్చికి గతంలో ఎప్పుడూ లేని ధర పలుకుతున్నది. గత ఏడాది పత్తికి మార్కెట్లో మద్దతు ధర కూడా లభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జరిపించింది. ఫలితంగా పత్తి రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కింది. ఈ ఏడాది పింజ పొడవు పత్తికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.6,025 ఉంటే, ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ రూ.7 వేలు తగ్గలేదు. ఈ నెల 4వ తేదీన పత్తి గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.9,850 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో పత్తికి ఇదే రికార్డు ధర. ఇంత ధర పత్తికి గతంలో ఎప్పుడూ లభించలేదు. సోమవారం పత్తికి గరిష్ఠంగా రూ.9,770 ధర పలికింది. కనిష్ఠ ధర రూ.8 వేలు తగ్గడం లేదు. ఈ ఏడాది రైతులు ఇప్పటివరకు క్వింటాల్ పత్తికి రూ.8వేల నుంచి రూ.9,850 వరకు పొందారు. ప్రస్తుత సీజన్లో మార్కెట్కు 5.18 లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మిర్చికి మంచి ధర..
పత్తితో పాటు ఈ ఏడాది మిర్చికి కూడా డిమాండ్ ఉంది. ఎనుమాముల మార్కెట్కు తేజ, వండర్హాట్, యూఎస్341, దేశీ, దేవునూరి డీలక్స్(డీడీ), 1048, తాలు, 334 రకం మిర్చి వస్తున్నది. ఇన్ని రకాల మిర్చి వచ్చే వ్యవసాయ మార్కెట్ తెలంగాణలో ఇదొక్కటే. సోమవారం దేశీ రకం మిర్చికి పలికిన ధర మార్కెట్లో రికార్డు నమోదు చేసింది. దేశీ రకం మిర్చికి ఊహించని రీతిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన రైతు వంగ ఐలయ్య 16 బస్తాల్లో దేశీ రకం మిర్చిని ఎనుమాముల మార్కెట్కు తెచ్చాడు. అడ్తిదారు సదాశివ ట్రేడర్స్ ద్వారా లక్ష్మీసాయి ట్రేడర్స్ ఈ మిర్చిని క్వింటాల్కు రూ.27 వేల చొప్పున కొనుగోలు చేసింది. మార్కెట్ చరిత్రలో దేశీ రకం మిర్చికి ఇంత ధర పలకడం ఇదే ఫస్ట్ టైం. వండర్హాట్, యూఎస్341, తేజ, డీడీ, 1048 రకం మిర్చికి కూడా అధిక ధర పలికింది. గత శుక్రవారం ఈ మార్కెట్లో క్వింటాల్ వండర్హాట్కు గరిష్ఠ ధర రూ.22,500, యూఎస్341 రకానికి గరిష్ఠ ధర రూ.25 వేలు, డీడీ రకానికి గరిష్ఠ ధర రూ.23 వేలు, 1048 రకానికి రూ.19 వేలు పలికినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 1.60 లక్షల క్వింటాళ్లకుపైగా మిర్చి వచ్చింది. ఈ సీజన్లో అత్యధికంగా సోమవారం మార్కెట్కు సుమారు 50వేల మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రికార్డు స్థాయిలో ఆదాయం..
వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర పలుకుతుండడంతో ఎనుమాముల మార్కెట్కు ఫీజు రూపంలో వచ్చే ఆదాయం పరుగులు పెడుతున్నది. ప్రతి వ్యవసాయ మార్కెట్కు పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై ఫీజు ద్వారా ఆదాయం సమకూరుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఫీజు రూపంలో ఎనుమాముల మార్కెట్ నిర్దేశిత ఆదాయ లక్ష్యం రూ.28 కోట్లు. మరో నెలన్నర సమ యం ఉండగా ఇప్పటికే ఈ మార్కెట్కు 115 శాతం ఆదాయం సమకూరింది. రూ.32 కోట్లకుపైగా ఆదా యం వచ్చినట్లు మార్కెట్ అధికారులు చెప్పారు. గత మూడేళ్ల ఆదాయాన్ని పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం గణనీయమైన ప్రగతి కనబడుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎనుమాముల మార్కెట్ ఆదాయ లక్ష్యం రూ.25.25 కోట్లు. టార్గెట్ను అధిగమించి రూ.25.29 కోట్ల ఆదాయం సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం లక్ష్య సాధనలో వెనుకబడింది. నిర్దేశిత ఆదాయ లక్ష్యం రూ.27.77 కోట్లు. ఇందులో రూ.24.91 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యం రూ.28 కోట్లుగా నిర్దేశిస్తే ఇప్పటికే టార్గెట్ను అధిగమించి రూ.32 కోట్లు దాటింది. ఇది కూడా రికార్డుగానే అధికారులు చెబుతున్నారు.