జనగామ, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది..తొలి జాబితాలో టికెట్ దక్కని బీసీ వర్గానికి చెందిన బేజాడి బీరప్ప వర్గీయుల్లో అసంతృప్తి భగ్గుమన్నది. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఇక్కడి నుంచి పార్టీ టికెట్ ఆశించారు. అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్న బచ్చన్నపేట మండలానికి చెందిన ఆయన వర్గీయులు, బీసీ కుల సంఘాల ముఖ్యనేతలు రహస్యంగా సమావేశమై అభ్యర్ధిని మార్చాలని బుధవారం హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర పార్టీ ముఖ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు. పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో జనగామ బీజేపీ అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్రెడ్డి పేరును ప్రకటించింది. టికెట్ తనకే దక్కుతుందని ఆశలు పెంచుకున్న బేజాడి బీరప్ప వర్గీయులు నైరాశ్యానికి గురై రెండురోజులుగా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలో తన వర్గీయులతో అత్యవసర సమావేశం నిర్వహించుకున్నారు.
బేజాడి బీరప్ప అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలని, మెజార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో బేజాడి బీరప్ప సేవలు చేస్తే కేవలం లాబీయింగ్తో టికెట్ తెచ్చుకున్న దశమంత్రెడ్డికి కనీసం గ్రామాల పేర్లు, కార్యకర్తలు బాగోగులు కూడా తెలవదని అధిష్టానానికి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకొనే ప్రసక్తేలేదని బీరప్ప వర్గీయులు అధిష్టానం వద్ద కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జావడేకర్, బీజేపీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పేర్లతో కూడిన ఒక లేఖను జనగామ బీజేపీ అసమ్మతి నాయకులు బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందజేశారు. వెనకబడిన బీసీ వర్గాల నుంచి బలమైన నాయకత్వాన్ని రాష్ట్రపార్టీ ప్రోత్సహిస్తుంటే..
జనగామ నియోజకవర్గంలో మాత్రం అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తున్న తీరును కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. బీరప్ప ప్రతి నెలా లక్షలాది రూపాయలు తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలను చేస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లో రెడ్లకు సీట్లు ఇచ్చిన సందర్భంలో బీజేపీలో బీసీ స్థానిక బిడ్డకు టికెట్ వస్తే అత్యధిక ఓటర్లు అయిన బీసీలు ఈ నియోజకవర్గంలో పార్టీ పక్షం ఉండే అవకాశం మెండుగా ఉందన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని రాష్ట్ర నాయకత్వం వదిలేసిందని పేర్కొన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ వృత్తి నిపుణుడిగా ఈ ప్రాంత ప్రజానికానికి సుపరిచితుడైన బేజాడి బీరప్పకు టికెట్ ఇచ్చే విషయంలో పునరాలోచించాలని కోరారు. పార్టీ నిర్వహించిన సర్వేలో ముందున్న వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా బీజేపీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తల అభిష్టానికి, సర్వే రిపోర్టులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కార్యకర్తలకు ఆత్మహత్యా సదృశ్యం లాంటిది కూడా అందులో ప్రస్తావించారు.
బీజేపీలో కురుమలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆరోపిస్తూ తమ కులానికి చెందిన నాయకులకు టికెట్లు కేటాయించాలని బుధవారం కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో హైదరబాద్ గన్పార్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమితి రాష్ట అధ్యక్షుడు గొరిగె నర్సింహా కురుమ మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన బీజేపీ తమకు ఒక టికెట్ ఇవ్వకపోవడం విడ్డూరం అన్నారు. కురుమలకు టికెట్ల ఇవ్వకుంటే బీజేపీ సభల్లో నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవైసీఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ మహేందర్ కురుమ, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల రమేశ్ కురుమ, జిల్లా అధ్యక్షుడు బండారు శ్రీశైలం కురుమ, గౌడ రాజ్ కుమార్, కేవైసీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బీర్ల శ్రీనివాస్ కురుమ, ఉబ్బటి సత్యం కురుమ, జోగు సోమయ్య, కట్న సాయి కుమార్, చిందం రాజ్, జిల్లా కార్యదర్శి ఉబ్బటి సత్యం, మిర్యాల సాయి కుమార్, గౌదిచర్ల శ్రీశైలం,భోజన సాయి రాం, బక కన్నీ తదితరులు పాల్గొన్నారు.