పర్యావరణ పరిరక్షణతోపాటు అడవుల విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నాటుతున్నారు. ఎనిమిదో విడుతలో భాగంగా 12 మండలాల్లోని 290 గ్రామాల్లో ఈ సంవత్సరం 32 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 305 నర్సరీల్లో 52 లక్షల మొక్కలు సిద్ధం చేశారు. లక్ష్యానికనుగుణంగా ఇప్పటికే 50 శాతం మేరకు నాటారు. వీటిలో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను ఇంటింటికీ ఆరు చొప్పున ప్రజాప్రతినిధులు, అధికారులు అందిస్తున్నారు. మరోవైపు జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు ఇరువైపులా అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా 27 ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేశారు.
జనగామ, జూలై 25 (నమస్తే తెలంగాణ) : జిల్లా వ్యాప్తంగా ఎనిమిదో విడుత హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతున్నది. కొంత ఆలస్యంగానైనా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటడాన్ని అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు ఉద్యమంలా చేపట్టారు. ప్రధాన రహదారులు, మండల, గ్రామీణ రహదారులపై పెద్దఎత్తున అవెన్యూ, మల్టీలేర్, కమ్యూనిటీ ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను అందజేస్తున్నారు. ఈఏడాది 32 లక్షల మొక్కలు నాటాలని ఆయా శాఖలకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించి 52 లక్షల మొక్కలను సిద్ధం చేసింది. వీటిలో ఇప్పటికే 40 లక్షల మొక్కలను రహదారులు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాల్లో నాటుతున్నారు. ఇప్పటికే సగానికి పైగా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయింది. నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలను ప్రభుత్వశాఖల వారీగా పంపిణీ చేస్తున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలోని 24 నర్సరీలు, అటవీశాఖ ఆధ్వర్యంలోని 28 నర్సరీలతోపాటు 253 గ్రామ నర్సరీలు సహా జిల్లా మొత్తంగా 305 నర్సరీల్లో 52 లక్షల మొక్కలు పెంచారు. వీటిని నాటేందుకు ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలు నిర్ధేశించగా, వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో ఎంపిక చేసిన ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు. జనగామ జిల్లాలో అడవుల శాతం పెంచి కరువును నివారించేందుకు ఇప్పటికే ఏడు విడతల్లో ఉద్యమస్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు.
గతంలో డీఆర్డీఏ ద్వారా కోటి విత్తన బంతులను తయారు చేసి గుట్టలు, ఏనెలు, ఖాళీ స్థలాలు, గట్లపై విసిరారు. అప్పట్లో అన్ని శాఖల ఉద్యోగులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలు ఉత్సాహంగా భాగస్వాములు కాగా, వాటి ఫలితాలు ఇప్పుడు మొక్కల రూపంలో కనిపిస్తున్నాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఎనిమిదో విడుత హరితహారంలో భారీ లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జనగామ నియోజకవర్గంలో ఒక్కరోజే దాదాపు 90 వేల మొక్కలు నాటారు. ఎప్పటిలాగే ఈసారి పండ్ల మొక్కలు, గృహాల్లో పెంచుకునే పల్లె, మందార మొక్కలు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. జామ, కరివేపాకు మొక్కలను పాఠశాలలు, వసతి గృహాల్లో నాటుతున్నారు. కాగితపూలు, గోరింట, గచ్చకాయ వెదురు వంటి మొక్కలను వైకుంఠదామాల్లో పెన్సింగ్గా ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతాలు, మైన్స్లలో మంకీఫుడ్ కోర్టు మొక్కలు, అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను గ్రామపంచాయతీ నుంచి కొనుగోలు చేసి ప్రతి మండలంలో 500 మీటర్లు ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు. నాటిన ప్రతి మొక్కను జియో టాగింగ్ చేసి పిట్టింగులకు ప్లాంటేషన్ ఖర్చులను ఆన్లైన్లో చెల్లిస్తున్నారు. ఫారెస్టు అధికారులు విత్తన బంతులు తయారు చేస్తుండగా, జనగామ జిల్లా ప్రారంభ, ముగింపు సరిహద్దులైన పెంబర్తి నుంచి చిన్నపెండ్యాల వరకు రహదారులకు ఇరువైపులా పూల మొక్కలు నాటించి అందంగా కనిపించేలా కార్యాచరణ రూపొందించారు. రోడ్లు, కాల్వలు, చెరువుల పక్కన, రైతులు పొలాల్లో నాటేందుకు టేకు, ఎర్రచందనం, వెదురు, సిల్వర్ఓక్, ఈత, కానుగ, ఫెల్టోఫామ్, గుల్మహర్, రేల, రేయిన్ట్రీ, నిమ్మ , జామ, మునగ, కరివేపాకు కూడా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు.
27 ప్రభుత్వశాఖలకు టార్గెట్..
ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటేందుకు 27 ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. ఇందులో డీఆర్డీఏ, అటవీశాఖ, మున్సిపల్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ, ఎక్సైజ్, మైనార్టీ, దేవాదాయ, పోలీసు, వ్యవసాయ, పశుసంవర్దక, ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మార్కెటింగ్, ఆర్టీసీ, విద్యాశాఖ, ట్రైబల్వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎన్పీడీసీఎల్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, మైన్స్ అండ్ జువాలజీ, సోషల్ వెర్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టళ్లు, జిల్లా సంక్షేమశాఖలకు మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎగువ ప్రాంతమైన జనగామ జిల్లాలో ఒకశాతం మాత్రమే ఉన్న అటవీ సంపదను హరితహారం ద్వారా జూలై మాసం పూర్తిగా, ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి లక్ష్యాన్ని చేరుకునేలా విరివిగా మొక్కలు నాటే కార్యచరణపై జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.