జనగామ, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ఎస్సారెస్పీ, దేవాదుల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ రైతులకు సాగు నీరందించి పంటలు ఎండిపోకుండా చూడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝాను కోరారు. బుధవారం జనగామ కలెక్టరేట్లో బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులతో కలిసి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
కొంత మంది సర్పంచులను ఇబ్బందులు పెడుతున్నారని, గ్రామాల అభివృద్ధికి కేటాయించే పనుల విషయంలో సహకరించాలని కోరారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకర్గంలోని నీలిబండ, గూడూరు, లక్ష్మణ్తండాలో తిరిగి రీకౌంటింగ్ జరిపించాలని కోరారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించి పంటలు ఎండిపోకుండా చూడాలని కోరారు. ఈజీఎస్ కింద లేబర్ వర్క్ చేసిన ప్రతి గ్రామానికి రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు మెటీరియల్ కాంపోనెంట్ కింద పనులు వస్తాయని, వాటిపై సర్పంచులకే పూర్తి హక్కు ఉంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈజీఎస్ నిధులకు సంబంధించిన పనులను సర్పంచులు తీర్మానం చేసి పంపించాల్సి ఉన్నప్పటికీ, కొందరు కావాలని రాజకీయం చేస్తున్న తీరును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాలకుర్తి ఎమ్మెల్యే సంబంధిత అధికారుల ద్వారా సర్పంచులను పిలిపించుకొని తనను కలిస్తేనే పనులవుతాయని చెబుతున్న విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్పంచులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై అవసరమైతే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు, ఇతర అభివృద్ధి పనులు సర్పంచుల ద్వారా జరగాల్సిందేనన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ మద్ధతుతో గెలిచిన సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
కార్యదర్శుల మూకుమ్మడి బదిలీ అంశంపై కలెక్టర్ను అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రక్రియ మాత్రమేనని చెప్పారన్నారు. సమస్యలన్నింటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఎలాంటి పనులున్నా నేరుగా తనను కలవాలని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులకు సూచించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ఖర్చు విషయంలో నిబంధనలకు లోబడి పనులు జరుగుతాయని, ఎవరెన్ని చెప్పినా న్యాయం వైపే పనిచేస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పల్లా సుందర రామిరెడ్డి, నవీన్కుమార్, తీగల దయాకర్, బస్వ మల్లేశం, ధరావత్ రాంసింగ్, మహేందర్ తదితరులున్నారు.