ఐనవోలు, జనవరి 13 : ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు భోగి పండుగ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రాతఃకాలం మేలుకొలుపుతో పూజలను ప్రారంభించనున్నారు.
ధ్వజారోహణంతో ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఒగ్గుపూజారులు స్వామి వారికి మేల్కొలుపు చేశారు. శైవాగమ పద్ధతిలో అర్చకులు ప్రాతఃకాలంలో విఘ్నేశ్వర పూజ, రుద్రాభిషేకం, నూతన వస్ర్తాలంకరణ నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, శైవశుద్ధి పుణ్యాహవాచనం చేశారు. ఉత్సవ ప్రా రంభ సూచికగా కాషాయ ధ్వజ పతాకలను చేతబూని మంగళవాయిద్యాలతో ఉపప్రధాన అర్చకు డు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణలతో మూడుసార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయ శిఖరం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి గుడిపై ఎగురవేశారు.
అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మహానివేదన నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేసి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఈవో నాగేశ్వర్రావు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఎద్దు సత్యనారాయణ, పోలెపల్లి బుచ్చిరెడ్డి, మార్నేని వెంకటేశ్వర్రావు, నునావత్ కీమానాయక్, మజ్జిగ రాములు, గడ్డం శ్రీనివాస్, జెట్టబోయిన శ్రీనివాస్, ఒగ్గుల మాధవి, తాటికొండ కృష్ణమూర్తి, చెరుకొండ వెంకటేశ్వర్లు, కొండేటి మమత, కూస చిరంజీవి, నాగబెల్లి మహేందర్, గురుమంచి వేణుగోపాలాచారి, వేదపండితులు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జ్యోషి, అర్చకులు ఐనవోలు మధుకర్శర్మ, పాతర్లపాటి శ్రీనివాస్, అర్చకులు నందనం మధుశర్మ, పాతర్లపాటి నరేశ్శర్మ, నందనం భానుప్రసాద్, ఉప్పుల శ్రీనివాస్, ఆలయ సిబ్బంది కిరణ్, మధుకర్, శ్రీకాంత్, రాజు పాల్గొన్నారు. నేడు భోగి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రాతఃకాలం మేలుకొలుపుతో పూజలు ప్రారంభం కానున్నాయి.