కాశీబుగ్గ/దామెర, సెప్టెంబర్ 30: ఓరుగల్లుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ను సీఎం ప్రారంభించనున్నారు. బేగంపట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్లోనేరుగా ప్రతిమ సంస్థల వద్దకు చేరుకుంటారు. ప్రారంభోత్సవాల అనంతరం తిరిగి హెలీకాప్టర్లో హైదరాబాద్కు వెళ్తారు. ఆయన వెంట మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ శుక్రవారం వేర్వేరుగా పరిశీలించారు.
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సుమారు మూడు గంటలపాటు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి, కమిషర్ ప్రావీణ్య పర్యవేక్షిస్తున్నారు. హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించి వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, తహసీల్దార్ రియాజొద్దీన్, పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షించి ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ జిల్లాలో 20 ఏండ్లుగా వైద్య విద్య, వైద్య సేవలు అందిస్తున్నదని, ఇక నుంచి ఓరుగల్లులో సేవలు అందనున్నాయని వరంగల్ ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ గ్రూప్ ఆఫ్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్రావు తెలిపారు. క్యాన్సర్ అంటే మరణమేనని భావించే పరిస్థితిని మార్చేలా ప్రతిమ సేవలు అందిస్తుందని చెప్పారు. అత్యాధునిక వసతులతో 350 పడకల సెంట్రల్ ఏసీ హాస్పిటల్, మొబైల్ క్లినిక్ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల వారికి ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భారత్ సేవలను ఏసీ వార్డులో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తుందని వివరించారు.