ఖిలావరంగల్, సెప్టెంబర్ 11: సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం గ్రేటర్ 17వ డివిజన్లోని బొల్లికుంట, రామకృష్ణపురం, ముస్కలపల్లిలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ఎమ్మెల్యే చల్లా పర్యటించారు. తర్వాత వసంతాపురం, స్తంభంపల్లి గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూ.2.44కోట్లతో బొల్లికుంటలో పూర్తిచేసిన సీసీ రోడ్లు, మురికి కాల్వలను ప్రారంభించారు. రూ.70లక్షలతో మహిళా భవనం, మాల కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతువేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఏడాది మార్చిలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన 157మంది రైతులకు రూ.24లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వసంతపూర్, స్తంభంపల్లిలో రూ.3.50కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడు కాల్వలు, బీటీ రోడ్లను ప్రారంభించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన 590 మంది రైతులకు రూ.79.80లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్ల నాటికి, నేడు ఉన్న పరిస్థితులను ప్రజలు గమనించాలన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ వెంట ప్రజలు నిలువాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుందని నాటి పాలకులు చెప్పారని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచితంగా 24గంటలపాటు విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వస్తే కాంగ్రెసోళ్లు 3గంటల కరెంటు ఇస్తరంటా, బీజేపీ వాళ్లు మోటర్లకు మీటర్లు బిగిస్తామంటున్నారని తెలిపారు. మోటర్లకు మీటర్లు పెడితే తెలంగాణకు రూ.25వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా రైతులకు ఉచిత కరెంట్ అందిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ 60ఏండ్లు పరిపాలించినప్పటికీ నేటి ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపుతోందన్నారు. సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ స్కీంలు ఇతర రాష్ర్టాల్లో లేవు ; వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో లేవని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎట్ల చేస్తదో ప్రజలు ప్రశ్నించాలన్నారు. ఆసరా పింఛన్లతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ తదితర పథకాలను సీఎం కేసీఆర్ వచ్చాకే అమలమయ్యాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కార్పొరేటర్ గద్దె బాబు, పీఏసీఎస్ వైస్ చైర్పర్సన్ సోల్తీ భూమాత, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కత్తెరపల్లి దామోదర్తోపాటు ఏఎంసీ డైరెక్టర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.