తాడ్వాయి, ఫిబ్రవరి 12: మేడారం జాతర అభివృద్ధి పనులు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 రోజులు గడవక ముందే సీసీ రోడ్లు, డివైడర్లు మొత్తం పగుళ్లు తేలడంతో ‘ఇదేనా నాణ్యత’ అంటూ చర్చించుకుంటున్నారు. జాతర సందర్భంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల ఆధ్వర్యంలో రూ.కోట్లు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం రోడ్లు వేస్తున్నామని ప్రచార ఆర్భాటాలు చేసినా పనుల్లో మాత్రం అలాంటివి కనిపించడం లేదు.
మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి హరిత జంక్షన్ వరకు వేసిన సీసీ రోడ్లు మొత్తం పగుళ్లు తేలి దర్శనమిస్తున్నది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు దృష్టి సారించకపోవడంతో కాంట్రాక్టర్లు, అధికారులు మిలాఖత్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో సంబంధిత అధికారులను వివరణ కోరగా.. డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ పగుళ్లు తేలిన రోడ్లకు తిరిగి మరమ్మతులు చేపడుతామని చెప్పడం విస్మయానికి గురిచేస్తున్నదని, దీంతో ప్రజాధనం వృథా చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు.
కంపు కొడుతున్న జాతర పరిసరాలు
భక్తుల సౌకర్యార్థం జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్ల సెప్టిక్ ట్యాంకులను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూ డ్చకపోవడంతో పరిసరాలు కంపుకొడుతున్నా యి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మహాజాతర సందర్భంగా సుమారు 222 లోకేషన్లలో 4,440, 1055 మొబైల్ టా యిలెట్లను జంపన్నవాగు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, కొంగలమడుగు, రెడ్డిగూడెం, ఊర ట్టం, కన్నెపల్లి, కొత్తూరు, జంపంగవాయి తదితర ప్రదేశాల్లోని పంట పొలాల్లో ఏర్పాటు చే శారు.
జాతర ముగిసిన అనంతరం వాటి చు ట్టూ ఏర్పాటు చేసిన రేకులను తొలగించి గోదాంలకు తరలించారు. అయితే వ్యర్థాలతో నిండిన సెప్టిక్ ట్యాంకులను పూడ్చివేసే పనుల ను మాత్రం చేపట్టలేదు. దీంతో జాతర పరిసరాలు కంపు కొడుతుండడతో స్థానికులతో పా టు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పంట పొలాల్లోకి వెళ్లే పశువులు, అటవీ జంతువులు, రాత్రి వేళ్లలో అందులో పడిపోయే ప్రమాదముందని, తీవ్ర నష్టం సంభవించే అవకాశముందని స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.