Telangana Martyrs | ‘తెలంగాణ మలిదశ పోరాటంలో నా కొడుకు నవీన్ చేసిన ప్రాణ త్యాగం వృథా కాలేదు. ఉద్యమ సమయంలో కేంద్రం పూటకో మాట మార్చుడు, సీమాంధ్ర పాలకులు కుట్రలు చేసుడుతోటి ఆగమైన నా కొడుకు రైలు కిందపడ్డడు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని ఇచ్చిన మాట కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీ పాలకుల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించిండు. సారు అందరికీ న్యాయం జేస్తుండు. మాకు ఆర్థిక సాయం చేసి, నా కొడుక్కు నౌఖరి ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నడు’ అని అమరుడు నవీన్ తల్లి కాజమ్మ వివరించారు.
కాజీపేట, జూన్ 22 : దర్గా కాజీపేట జాగీర్, గాంధీనగర్కు చెందిన నద్దునూరి దివంగత మల్లయ్య, కాజమ్మ దంపతులకు నలుగురు కొడుకులు కుమార్, రమేశ్, శంకర్, నవీన్, ఒక కుమార్తె. కాజమ్మ నిట్ ఇంజినీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ స్లీపర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో చిన్నకొడుకు నవీన్ నగరంలోని కేడీసీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే స్వరాష్ట్ర ఉద్యమానికి ఆకర్షితుడై ఎక్కడ ధర్నాలు, నిరసనలు జరిగినా పాల్గొనేటోడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, నాటి కుట్రల కారణంగా కలత చెంది 2011, అక్టోబర్ 1న దర్గా- వరంగల్ రైల్వే ట్రాక్పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుతోనైనా కేంద్రం, సీమాంధ్ర పాలకులు కండ్లు తెరిచి ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలి’ అని సూసైడ్ నోట్లో రాశాడు. విషయం తెలిసి ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో పాటుల పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మా తమ్ముడు నవీన్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో సీమాంధ్ర పాలకుల అరాచకాలను భరించలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ మాకు రూ.పది లక్షలు ఇచ్చిండు. నాకు ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచిండు. అన్ని విధాలా ఆసరాగా నిలిచి మా కుటుంబానికి ఆసరా అయిండు. గతంలో నేను కారు డ్రైవర్గా పనిచేసి అతి కష్టంమీద కుటుంబాన్ని పోషించేటోన్ని. 2016 నుంచి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్గా ఉద్యోగం చేస్తున్న. సీఎం కేసీఆర్ దయతో మా కుటుంబం ఇబ్బందుల్లేకుండా ఉంటున్నది. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– నద్దూనూరి శంకర్, నవీన్ అన్న
నా చిన్న కొడుకు ‘అమ్మా తెలంగాణ సాధించే దాకా పోరాడుతా.. సీమాంధ్ర పాలకులు కండ్లు తెరువాలంటే అవసరమైతే ప్రాణ త్యాగమైనా చేస్తా’ అనేవాడు. ఉద్యమ సమయంలో పూటకో విధంగా అప్పటి కేంద్రం, సీమాంధ్ర పాలకులు మాటమార్చుడు వల్ల నా కొడుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నడు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మాకు రూ.10లక్షలు ఇచ్చిండు. నా మూడో కొడుకు శంకర్కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిండు. తెలంగాణల అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ కేసీఆర్ సమన్యాయం చేస్తున్నాడు. సీఎం కేసీఆర్ పాలన మంచిగున్నది. గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో చేయని పనులు సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసిండు. ఎవుసానికి సాగునీరు ఇస్తున్నడు. 24గంటల కరంటిస్తున్నడు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడు. రైతు బంధు, రైతుబీమా, పింఛన్లు ఇవన్ని గత పాలకులు ఇచ్చిండ్రా? మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.. తెలంగాణ బాగుపడాలంటె ఆయనే ఉండాలి.
– నద్దునూరి కాజమ్మ, అమరుడు నవీన్ తల్లి