డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో సామాన్యులే బలవుతున్నారు. మద్యం తాగి వాహనం నడిపి, పోలీసులకు పట్టుబడిన తర్వాత, సీజ్ చేసిన వాహనాలు తిరిగి తీసుకోవడానికి వాహనదారులు నానా కష్టాలుపడుతున్నారు. తాగి వాహనం నడపడంతోపాటు రిజిస్ట్రేషన్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్లాంటివి లేని కారణాలతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
చేసిన తప్పుకు ప్రభుత్వ ఖాజానాకు జరిమానా చెల్లించినప్పటికీ సిబ్బంది వసూళ్ల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కౌన్సెలింగ్, కోర్టు ద్వారా జరిమానా చెల్లించే క్రమంలో ఏం జరుతున్నదనే విషయమై ‘నమస్తే తెలంగాణ’ క్షేత్ర స్థాయిలో ఆరా తీసింది. దీంతో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది అడ్డగోలు వసూళ్లకు పాల్పడిన తీరు వెలుగులోకి వచ్చింది. – సుబేదారి, ఏప్రిల్ 5
మద్యం తాగి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి పోలీసు శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, కోర్టు ద్వారా జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో.. ప్రధానంగా వరంగల్ నగరంలోని కాజీపేట, హనుమకొండ, మట్టెవాడ ట్రాఫిక్ పోలీసులతోపాటు శివారు ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులు క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతుండగా.., రోజుకు సగటున 120 నుంచి 200 మంది వాహనదారులు పట్టుబడుతున్నారు. బ్రీత్ ఎనలైజర్లో ఆల్కహాల్ శాతం 35కు మించి ఉంటే వెంటనే వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో జరిమానా చెల్లించేందుకు సంబంధిత పోలీసు స్టేషన్ కోర్టు కానిస్టేబుల్కు రెఫర్ చేస్తారు. పట్టుబడిన వాహనదారులు హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరై కోర్టు ద్వారా ఫైన్ చెల్లించి వాహనాలను రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు కథ మొదలువుతుంది.
మద్యం తాగి పట్టుబడిన వాహనదారులకు వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్, లా అండ్ అర్డర్ విభాగంలో కోర్టు కేసులు చూసే కానిస్టేబుళ్ల సమాచారంతో రోజుకు వంద నుంచి 200 మందికిపైగా వాహనం ఆర్సీ, ఆధార్కార్డుతో కౌన్సెలింగ్కు హాజరవుతుంటారు. వారికి తాగి డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై వీడియో క్లిప్పింగ్ల ద్వారా అవగాహన కల్పిస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చే వారి నుంచి అక్కడ పనిచేసే కొందరు పోలీసు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ సీపీ ఆఫీస్ కౌన్సెలింగ్ చాంబర్కు వెళ్లి ఆరా తీయగా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
వాహనదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది రోజువారీగా పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 200 మంది వరకు జరిమానా చెల్లించగా, ఒక్కో రసీదుకు రూ. 500 చొప్పున రూ. లక్ష వరకు రాగా, వాటిని వాటాలు వేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కమిషనరేట్ పరిధిలోనే కాకుండా బయట సబ్ డివిజన్లలో కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే పట్టుబడిన వాహనాలను పోలీసులు బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్ల ఆవరణలోని పార్కింగ్ స్థలాల్లో ఉంచుతున్నారు. రోజు వారీగా పార్కింగ్ స్థలాల యజమానులకు డబ్బులివ్వాలనే పేరుతో బైక్కు రోజుకు రూ. 200 చొప్పున తీసుకుంటున్నట్లు పలువురు బాధితులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్న వారిలో దినసరి కూలీలు, ఆటో, లారీ, ఇతర చిన్న, మధ్య తరహా గూడ్స్ వాహనాల డ్రైవర్లు, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు, భవ నిర్మాణ కార్మికులు, గ్రామం నుంచి నగరంలో పనిచేసి తిరిగి వెళ్లిపోయే సామాన్యులే ఉంటున్నారు. శుభకార్యాలు, చావులకు సంపన్న వర్గాలకు చెందిన రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న వారు మద్యం సేవించి కార్లు, బైక్లు నడుపుతున్నారు. వారిని పోలీసులు పట్టుకోవడం లేదు. పట్టుకున్నా వారు పలుకుబడితో బయటకు వస్తున్నారు లేదా పరువుకోసం డబ్బులు ముట్టజెప్పి తప్పించుకుంటున్నారు.
హనుమకొండ జిల్లా కోర్టులోని సెంకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చాంబర్కి వెళ్లి ఆరా తీయగా అక్కడ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్లో పనిచేసే పలువురు కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది ప్రతి వాహనదారుడి నుంచి బాహటంగానే లం చం తీసుకుంటున్నారు. ఇక్కడ రోజుకు 200 మంది వరకు జరిమానా చెల్లించేందుకు వస్తుంటారు. కోర్టు కానిస్టేబుల్ అందజేసిన రసీదు ఆధారంగా కోర్టు సిబ్బంది మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లగా, మెజిస్ట్రేట్ విధించిన ఫైన్ను అదే చాంబర్లో నగదు రూపంలో చెల్లిస్తారు.
ఈ ప్రక్రియ ముగియగానే ఇక్కడ పనిచేసే ఇద్దరు సిబ్బంది జరిమానా రసీదు వాహనదారుడికి ఇచ్చేందుకు బాహటంగానే రూ. 500 తీసుకున్నారు. ఇక భారీ వాహనాలు నడిపిన వ్యక్తుల నుంచి అదనంగా డబ్బులు తీసుకోవడం లేదా ఫోన్పే చేయించుకోవడం కనిపించింది. కొందరిని జైలు శిక్ష పడుతుందని కోర్టు కానిస్టేబుళ్లు బెదిరిస్తూ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని జరిమానా చెల్లించేందుకు వచ్చిన వారు వాపోతున్నారు. డబ్బులిస్తేనే జరిమానా చెల్లించిన రసీదులిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక్కడ డబ్బులు తీసుకునే ఇద్దరు ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు రెగ్యులర్ ఉద్యోగులు వారిని ముందుపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.