హుజూరాబాద్/ జమ్మికుంట జనవరి 31 : టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఏర్పాటు చేసిన తొలి సభకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. మొదటిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు నీరాజనం పలికారు. కమలాపూర్ నుంచి వందలాది వాహనాలు, బైక్లోతో ర్యాలీగా అమాత్యుడు రామన్నకు జమ్మికుంటలో అడుగడుగునా స్వాగతించారు. దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ మైదానంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు మంత్రి రాగా, అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ఒక్కసారిగా ‘జై కేటీఆర్.. జైజై కేటీఆర్’ అంటూ నినదించారు. సభకు సుమారు 50వేల మందికిపైగా హాజరయ్యారు. ప్రతి గ్రామం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లపై తరలి వచ్చారు.
పలు కార్యక్రమాల కారణంగా మంత్రి కేటీఆర్ సభకు రావడం కాస్త ఆలస్యమైనా ప్రజలు ఓపికతో వేచి ఉన్నారు. మంత్రి కేటీఆర్ 5.07 గంటల నుంచి 5.29 గంటలకు రామన్న ప్రసంగించగా, ఆద్యంతం సభికులు ఆసక్తిగా విన్నారు. బండి సంజయ్, ఈటలపై పంచ్ డైలాగులు విసిరిన సమయంలో ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మహిళా రుణాల కోసం వంద కోట్లు ఇస్తామని మంత్రి దయాకర్రావు, హుజూరాబాద్లోని హైసూల్ గ్రౌండ్, జమ్మికుంటలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్ను మినీ స్టేడియంగా మార్చేందుకు 20 కోట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు.
కౌశిక్రెడ్డిపై ప్రశంసల జల్లు
బీఆర్ఎస్ శ్రేణులను ఒక్కతాటిపైకి తెచ్చి బహిరంగ సభను విజయవంతం చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డిపై మంత్రి కేటీ రామారావుతోపాటు సభకు విచ్చేసిన మిగతా ఇద్దరు మంత్రులు ప్రశంసలు కురిపించారు. తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడైన పాడి కౌశిక్రెడ్డి ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నాడని అన్నారు.