దేవరుప్పుల, మార్చి 3 : వందకు పైగా పక్షి జాతులకు ఆవాసంగా.. 40 ఏళ్లుగా సైబీరియన్ పక్షులకు నివాసంగా.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాద ప్రాంతంగా ఉంటున్నది ఓ తటాకం.. అదే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమడూరులోని గోపి చెరువు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటకంగా, జీవవైవిద్య కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేపట్టనున్నాయి. చినమడూరు గోపి చెరువులో వివిధ పక్షి జాతులు విహరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు చిత్తడి నేలల సంరక్షణ పథకంలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. సైబీరియా నుంచి వచ్చే పెయింటెడ్ స్టాక్స్ కొంగ జాతి పక్షులు గోపి చెరువును తమ సంతాన సాఫల్య కేంద్రంగా ఎంచుకున్నాయి. వేలాది కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి సంక్రాంతి వేళ సందడి చేస్తాయి. సంతానంతో జూన్, జూలై మాసాల్లో తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోతాయి. చెరువులోని చేపలు, ఇతర పురుగులను ఆహారంగా తీసుకుని చెట్లపై గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. పదేళ్లుగా గోపి చెరువులో సమృద్ధిగా నీరుండడంతో సైబీరియన్ పక్షులతోపాటు అనేక రకాల పక్షులకు నిలయంగా మారింది. ఇవేగాక రెడ్ నాప్ట్ ఐబిస్, బ్లాక్హెడ్డెడ్ ఐబిస్, ఇండియన్ రివర్డ్ టెర్నో పక్షులు ఇక్కడికి వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో గోపి చెరువును బయోడైవర్సిటీ కేంద్రంగా ప్రతిపాదించారు.
రూ. 1.8 కోట్లతో..
చిత్తడి నేలల సంరక్షణ కేంద్రంగా గుర్తించి న అధికారులు ఇటీవల చినమడూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం ని ర్వహించారు. జనగామ ఆర్డీవో గోపీరామ్, అటవీశాఖ జిల్లా అధికారి అజాజ్ అహ్మద్, నీటిపారుదల శాఖ డీఈ సౌజన్య, ఎంపీడీవో మేనక, తహసీల్దార్ అశ్వక్ అహ్మద్తో పాటు రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు స్థానికుల తో మాట్లాడారు. గోపి చెరువును జీవవైవిద్య కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రతిపాదించారు. ఇందుకు స్థానికులు సుముఖత వ్యక్తం చేశారు. గోపి చెరువు అభివృద్ధికి రూ.1.8 కో ట్లు అవసరమవుతాయని, వీటిని ప్రభుత్వం అందిస్తుందని అధికారులు వెల్లడించారు.

147 ఎకరాల్లో..
సర్వే నంబర్ 1194లో 147 ఎకరాల ఫుల్ట్యాంక్ లెవల్తో గోపి చెరువు విస్తరించి ఉంది. ఏడాది పొడవునా చెరువులో నీరుండేలా నీటిపారుదల శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం పూడికతీత, ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. చెరువు కట్ట సైజు పెంచి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ చెట్లు నరకడం, చేపల వ్యాపారం నిషేధించనున్నారు. అయితే స్థానిక మత్స్యకారులకు సడలింపు ఉంటుంది. పక్షుల నివాసానికి ఆవాసాలు ఏర్పాటు చేస్తారు. వందల జాతుల పక్షులు ఈ చెరువులో జీవనం సాగిస్తున్నా ప్రస్తుతం సంరక్షణ లేదు. వేసవిలో వలస వచ్చే పక్షులకు నీరు, ఆహారం, కొరత ఏర్పడుతుందని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోపి చెరువును చిత్తడి నేలల అభివృద్ధి పథకంలో చేర్చాయని అధికారులు పేర్కొంటున్నారు.
చినమడూరుకు శుభ పరిణామం
చినమడూరు గోపి చెరువును చి త్తడి నేలల సంరక్షణ పథకంలో చే ర్చడం శుభ పరిణామం. కోట్లాది రూపాయల నిధులు కేటాయించడంతో గోపి చెరువుతో పాటు గ్రా మాభివృద్ధి చెందుతుంది. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటే స్థానికంగా రహదారులు, ఇతర వసతులు సమకూరుతాయి. దశాబ్దాలుగా సైబీరియా కొంగలు ఇక్కడికి వస్తున్నాయి. స్థానికులు వీటిని అతిథులుగా భావించి అపాయం లేకుండా చూస్తున్నారు. వీటిని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి అనేక మంది వస్తున్నారు. దేవరుప్పుల మండలంలోని వాగులపై చెక్డ్యామ్లు నిర్మించడంతో ఏడాదంతా నీరుంటున్నది. దీంతో అనేక రకాల పక్షులు వస్తున్నాయి. గోపి చెరువు అభివృద్ధి పనులకు స్థానికుల సహకారం ఉంటుంది.
– మైదం జోగేశ్వర్, సర్పంచ్, చినమడూరు