వరంగల్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);రంగుల కేళి.. హోలీని మంగళవారం ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు అంతా సిద్ధమయ్యారు. హోలీ పర్వదినం సందర్భంగా ఊరువాడ, పల్లె పట్నంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్కెట్లన్నీ వివిధ రకాల రంగులు కొనుగోళ్లతో సందడిగా మారాయి. వీలైనంత వరకు రసాయనాలతో కాకుండా సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పండుగ నేపథ్యం..
ప్రతీ హోలీ పూర్ణిమ రోజు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హోలీ రోజునే ఆలయాల్లో ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. హోలీ అంటే అగ్నితో పునీతమైనదని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో వస్తుంది. రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అది అతడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతడి రాక్షససోదరి హోళీకను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు. దీంతో ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. అప్పుడు విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా, హోలిక రాక్షసి మాత్రం ఆ మంటలో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని ప్రచారంలో ఉంది. అందువల్ల రాత్రి పూట కామదహనం చేస్తారు.
మోదుగు పూల ప్రత్యేకత..
మోదుగు పూలకు హోలీ పండుగకు విడదీయరాని బంధం ఉంది. ఎరుపు వర్ణాన్ని అడవితల్లి ఎదనిండా విరబూసే మోదుగు పూలు చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. ఈ పూలతో చేసిన రంగులను హోలీలో చల్లుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ ఉండదంటారు. రసాయన రంగులతో హోలీ పండుగ జరుపుకొని అనర్థాలకు దారి తీస్తున్నప్పటికీ మోదుగు పూల పట్ల నిర్లక్ష్యం తప్పడం లేదు. ప్రధానంగా మోదుగు పూలలో ఔషధ గుణాలు ఉండడంతో వైద్య రంగంలో కూడా ఈ పూలను ఉపయోగిస్తారు. ఇదివరకు ఔషధ గుణాలున్న పారిజాతం, మోదుగుపూలతో పాటు మరికొన్నింటినితో సొంతంగా రంగులు తయారు చేసే ఆడుకునేవారు. కాలక్రమంలో కృత్రిమ రంగులకు అలవాటు పడి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
సంప్రదాయ రంగులే మేలు
రసాయనాలతో చేసిన రంగుల కంటే సంప్రదాయ రంగులే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఇష్టారీతిన రంగులు చల్లుకోవడం వల్ల అవి కళ్లలో పడి తీవ్ర ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే రసాయన రంగుల్లో లెడ్ ఆక్సైడ్, అల్యూమినియం బ్రొమైడ్, మెర్క్యురీ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్ ఉంటాయి. వాటి గాఢతను బట్టి రంగులు కళ్లలో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. గులాల్ వంటి రంగు పొడులతో అస్తమా, చర్మ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రసాయన రంగులను సాధ్యమైనంత వరకు దూరం చేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
స్నానాల వేళ జాగ్రత్త..
హోలీ వేడుకలు ముగిశాక స్నానం చేసేందుకు పిల్లలు, పెద్దలు చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతుంటారు. కానీ పిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్లకుండా చూడాలి. ఇంట్లోనే స్నానం చేయాలని పెద్దలు చెప్పాలి. చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్లడంతో పాటు మద్యం తాగడం వల్ల ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయి.