సప్తవర్ణాల వేడుక హోలీని జిల్లా ప్రజలు నేడు అంబరాన్నంటేలా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచే చిన్నాపెద్దా తేడాలేకుండా రంగులు చేతపట్టుకొని వివిధ కూడళ్లు, కాలనీల్లో కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు చల్లుకోనున్నారు. పాటలు పాడుతూ, ఆటలాడుతూ, నృత్యాలు చేస్తూ వీధివీధినీ హోరెత్తించనున్నారు. కాగా, కెమికల్ కలర్స్కు బదులు సహజ సిద్ధ రంగులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నర్సంపేట/ నర్సంపేటరూరల్/ చెన్నారావుపేట/ ఖానాపురం/ వర్ధన్నపేట/ కరీమాబాద్/ పోచమ్మమైదాన్/ వరంగల్ చౌరస్తా, మార్చి17: నర్సంపేటలో హోలీ సంబురాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి కామదహనం చేశారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హోలీ వేడుకలు ఒక రోజు ముందుగానే జరుపుకొన్నారు. నర్సంపేటలోని మహిళా బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం మహిళలు ఆనందోత్సాహాల మధ్య హోలీ ఆడారు. పాకాల మహిళా బ్యాంకు అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటా హోలీ నిర్వహిస్తున్నామని అన్నారు. కరోనా తర్వాత మహిళలు ఒకచోట చేరి సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్, మహిళా సమన్వయ సమితి అధ్యక్షురాలు రజనీభారతి, కౌన్సిలర్ దార్ల రమాదేవి, వాసం కరుణ, తక్కళ్లపల్లి ఉమ, పెండెం పద్మ, గుడిపూడి అరుణ, గొర్రె రాధ, విజయ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేటలోని అక్షర పాఠశాలలో చిన్నారులు హోలీ సంబురాలు నిర్వహించారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో ఆరోగ్యకరమైన పద్ధతుల్లో రంగులు చల్లుకోవాలని బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ అండృ రాజేంద్రప్రసాద్ కోరారు. చెన్నారావుపేట సిద్థార్థ గురుకుల హైస్కూల్లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్థార్థ విద్యా సంస్థల చైర్మన్ కంది గోపాల్రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం జక్కుల జగదీశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖానాపురం మండలంలోని మంగళవారిపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రంగులు చల్లుకున్నారు. హెచ్ఎం విజయలక్ష్మి మాట్లాడుతూ అందరూ సమానమనే భావనను విద్యార్థుల్లో కలిగించేందుకు, హోలీ ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేసేందుకు హోలీ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొర్ర రమేశ్, కృష్ణమూర్తి, వాగ్య, సారంగం తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పలువురు అధికారులకు రంగులు పూశారు. హమాలీ కార్మికులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయ ఆవరణలో యువకులు హోలీ సంబురాలను నిర్వహించారు. మండలంలోని దాసరిపల్లిలో మహిళా సంఘాల సభ్యులు రంగులు పూసుకున్నారు.
బాలాజీ టెక్నో స్కూల్లో హోలీ వేడుకలు నిర్వహించారు. వర్ధన్నపేట అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హోలీ వేడుకలను నిర్వహించారు. ఇల్లంద గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రాలతోపాటు గ్రామంలోని పలువురు యువకులు హోలీ జరుపుకొన్నారు. గ్రామంలో ఫొటో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యువకులు ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వరంగల్ అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, చిన్నారులతో కలిసి రంగులు పూసుకున్నారు. వరంగల్ ఆటోనగర్లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యాన గురువారం హోలీ వేడుకలను నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు కోడిగుడ్లు, పండ్లు, పాఠశాలకు అవసరమైన ట్యూబ్లైట్లు పంపిణీ చేశారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో హోలీ వేడుకలను నిర్వహించారు. మార్కెట్ ఉద్యోగులు, గుమాస్తాలు, వ్యాపారులు, దడవాయిలు రంగులు చల్లుకున్నారు. అన్ని యార్డుల వద్ద, మార్కెట్ ఆవరణలో రంగులు పూసుకుంటూ సంతోషంగా గడిపారు. వరంగల్ గిర్మాజీపేట గోమతి పబ్లిక్ స్కూల్లో హోలీ వేడుకలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కూచన క్రాంతికుమార్ విద్యార్థులకు హోలీ ఇతివృత్తాంతాన్ని వివరించారు. ప్రిన్సిపాల్ కస్తూరి హారతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.