హనుమకొండ , జూన్ 11 : కలం ఎంతో గొప్పదని కవులు తమ రచనల ద్వారా అనేక సందర్భాల్లో నిరూపిస్తున్నారని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్వాన్ని ఆవిషరించారు. ముందుగా కాళోజీ జంక్షన్లో తెలంగాణ ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, జిల్లాకు చెందిన ప్రముఖ కవుల చిత్ర పటాలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కవులు తదితరులు పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి హరిత హోటల్లో కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన సుమారు వంద మంది కవులు తమ కవితలతో తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఉద్యమ కాలం నాటి పరిస్థితులు, అమరుల త్యాగాలను గుర్తు చేశారు. కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ అందరినీ అలరించింది. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ నాడు ప్రజా కవి కాళోజీ కవిత్వం అందరినీ ఉర్రూతలూగించిందని, ఉద్యమానికి ఊపిరులూదిందని గుర్తు చేశారు.
మలివిడుత తెలంగాణ ఉద్యమంలోనూ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. జిల్లాకు చెందిన తేజోమూర్తులు కవిత్వాన్ని సుసంపన్నం చేశారన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వారిని కూడా సతరించుకోవాలనే ఉద్దేశంతో సాహిత్య దినోత్సవం ఏర్పాటు చేశారని కలెక్టర్ తెలిపారు. కవితలతో పుస్తకాన్ని ప్రింట్ చేయాలన్నారు. యువ కవులతో ప్రత్యేకంగా కవి సమ్మేళనం నిర్వహించాలని సూచించారు. కవులు, కళాకారులు, రచయితలను గౌరవించుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందన్నారు. మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారన్నారు. సాహిత్య దినోత్సవానికి పెద్ద సంఖ్యలో కవులు తరలివచ్చి విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. కవులు, కళాకారుల ఆటపాటలు ఎన్నో పోరాటాలకు ఫలితాలను అందించాయన్నారు. కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక, పారితోషకంతో ఘనంగా సతరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో ఎం వాసుచంద్ర, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీను, జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్ హై, జిల్లాకు చెందిన కవులు ప్రొఫెసర్ బన్న అయిలయ్య, వీఆర్ విద్యార్థి, అనిశెట్టి రజిత, పొట్లపల్లి శ్రీనివాసరావు, మహ్మద్ సిరాజుద్దీన్, వల్స పైడి, అస్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.