హనుమకొండ చౌరస్తా, జనవరి 13 : హనుమకొండ మచిలీబజార్కు చెందిన రావుల క్రాంతికుమార్(39) ఇటీవల పొలండ్ దేశంలో మృతిచెందగా.. చివరి చూపు కోసం అతడి కుటుంబసభ్యులు 19 రోజులుగా ఎదురుచూస్తుండడం కలచివేస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీబజార్కు చెందిన మాజీ కార్పొరేటర్ రావుల వనజ-సుదర్శన్కు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. పెద్దకొడుకు క్రాంతికుమార్(39) కంప్యూటర్ సైన్స్ చేసి పొలండ్లోని ఓ కంపెనీలో 16 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది హనుమకొండకు వచ్చిన ఆరు నెలల క్రితం తిరిగి వెళ్లాడు. అనారోగ్య సమస్యతో బాధపడుతూ గత నెల డిసెంబర్ 26న మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ కడచూపు కోసం ఎదురుచూస్తున్నారు. అతడికి భార్య సరిత, కొడుకు విద్వాన్ ఉన్నాడు. అయితే 15న మృతదేహం ఇంటికి రానుండగా ఉదయం 10 గంటలకు పద్మాక్షీ శివముక్తిధామ్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, తోట వెంకటేశ్వర్లు, అభినవ్భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.