కార్పొరేట్ హంగులతో ఆకట్టుకునే భవనం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ఎక్కడ ఏం జరిగినా చిటికెలో తెలిసేలా కమాండ్ కంట్రోలింగ్ వ్యవస్థ.. అనుక్షణం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ.. ‘5ఎస్’ సిస్టం, ఈ-ఫైల్స్ విధానంతో ఎప్పటికప్పుడు పనితీరులో మెరుగు.. ప్రజలు, ఫిర్యాదుదారుల్లో భయం పోయి స్వేచ్ఛా అనుభూతి కలిగేలా ఆహ్లాద వాతావరణం.. ఇలా ఫ్రెండ్లీగా ముందుకు సాగుతున్న స్మార్ట్ పోలీసింగ్కు హనుమకొండ పోలీస్స్టేషన్ ‘మాడల్’గా నిలుస్తోంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మూడు ఆదర్శ ఠాణాల్లో ఒకటైన ఈ స్టేషన్ను రూ.30లక్షలతో ఆధునీకరించగా స్మార్ట్ లుక్తో ఆకట్టుకోవడమే గాక అంతే స్మార్ట్గా ప్రజలకు చేరువై సత్వర న్యాయం, శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తోంది.
– సుబేదారి, అక్టోబర్ 3
సుబేదారి, అక్టోబర్ 4 : హనుమకొండ పోలీస్స్టేషన్ అత్యాధునిక హంగులతో ఆకట్టుకుంటూ సరికొత్త విధానంతో వేగం గా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఇక్కడ అధికారులు, సిబ్బంది మెరుగైన పనితీరుతో ముందుకుసాగుతున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2018 సంవత్సరంలో మూడు (హనుమకొండ, నర్సంపేట, హసన్పర్తి) పోలీస్స్టేషన్ల్లను మాడల్ స్టేషన్లగా తీర్చిదిద్దారు. ఇందులో హనుమకొండ స్టేషన్ ఒకటి. దీనిని సుమారు రూ.30లక్షల నిధులతో మాడల్గా స్టేషన్గా ఆధునీకరించారు. ఈ ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులు, విజిటర్స్కు ఇక్కడి వాతావారణం చూడగానే కార్పొరేట్ లుక్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కనిపిస్తున్నది.
పక్కాగా ఈ-ఫైల్స్ విధానం..
ఫిర్యాదుదారులు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిన వెంటనే రిసిప్ట్ ఇచ్చి వివరాలను కంప్యూటర్లో ఆప్లోడ్ చేస్తారు. రైటర్స్ ఎఫ్ఐఆర్, దర్యాప్తు, రిమాండ్, చార్జిషీట్ కానీ, కోర్టుకు సమర్పించే సాక్ష్యాధారాలు, సమన్లు, పైనల్ రిపోర్టు.. ఇలా ప్రతీది కూడా పేపర్లెస్, ఈ-ఫైల్స్ రూపంలో కంప్యూటర్లో ఆప్లోడ్ చేస్తారు. అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు పిటిషన్దారుల సమాచారం, నేరస్తుల సమాచారం స్టేట్ క్రైమ్ రికార్డు బ్యూరో, నేర తీవ్రతను బట్టి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకు ఆన్లైన్లో అనుసంధానం చేస్తారు. వర్టికల్స్ విధానంలో ఇతర స్టేషన్ల కంటే భిన్నంగా ప్రతి సెక్షన్కు ఇన్చార్జీలు ఉంటారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆన్లైన్లో నిత్యం మానిటరింగ్ చేస్తారు. ఇన్స్పెక్టర్, ఎస్సైలు, సిబ్బంది పని విధానంలో స్మార్ట్గా, టెక్నాలజీతో స్పీడ్గా శాంతిభద్రల పరిరక్షణ, నేరాలను ఆరికట్టడం, నిందితులకు కోర్టు ద్వారా తగిన శిక్షలు పడేలా పనిచేయడమే మాడల్ పోలీస్స్టేషన్ ప్రధాన లక్ష్యం.
పిటిషనర్లకు సకల సదుపాయాలు..
ఇన్స్పెక్టర్ చాంబర్, ఐదుగురు ఎస్సైలు, ఆరుగురు రైటర్లకు వేర్వేరుగా క్యాబిన్లు ఉన్నాయి. ఫైల్స్ అన్నీ కూడా సెక్టార్ వారీగా ర్యాక్లలో అమర్చుతారు. స్టేషన్ లోపల ఎక్కడ కూడా కాగితాలు కానీ చెత్త కానీ కనిపించదు. ప్రతి విభాగాన్ని ప్రతి రోజూ శుభ్రం చేస్తారు. నేరస్తులను అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్కు తీసుకువచ్చి విచారించేందు కు లాకప్ గది, పిటిషనన్లు కూర్చునేందుకు వీలుగా చైర్స్, తాగేందుకు మంచినీరు, అలాగే టాయిలెట్స్ అన్ని కూడా మాడ్రన్గా ఉన్నాయి. స్టేషన్కు వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్తో పాటు టాయిలెట్స్, తదితరాలు ఏర్పాటు చేశారు.
5 ఎస్ సిస్టం..
జపాన్ దేశం మాదిరిగా చేసే పని విధానాన్ని స్మార్ట్గా చేసేందుకు ‘5 ఎస్’ సిస్టంను పాటిస్తున్నారు. ఫైల్స్ అన్నీ భద్రపర్చడం, పరిశుభ్రంగా ఉంచడం, క్రమపద్ధతిలో వేగంగా పనిచేయడం, రోజురోజుకూ పనితీరును మెరుగు పరుచుకోవడం కోసం పోలీసింగ్ విధానంలో వస్తున్న సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుంటారు. ఇక్కడ ఇన్స్పెక్టర్తో పాటు ఐదుగురు ఎస్సైలు, 17మంది హెడ్కానిస్టేబుళ్లు, 45మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. వీరిలో ఒక మహిళా ఎస్సై, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. మానసిక ప్రశాంతతతో పనిచేసేలా ఇక్కడ సౌకర్యాలు కల్పించడంతో పాటు స్టేషన్ వాతావరణం ఆహ్లాదం పంచేలా ఆవరణలో పూలమొక్కలు, చెట్లు పెంచారు.
క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలా..
మాడల్ స్టేషన్లో టెక్నాలజీ వినియోగం అనేది అత్యంత కీలకం. ఈ స్టేషన్ లోపల, బయట మొత్తం 23 సీసీ కెమెరాలను అమర్చారు. బయటినుంచి వచ్చే వ్యక్తులు, లోపల పోలీసుల పనితీరును పర్యవేక్షించేందుకు వరంగల్ కమిషనరేట్, హైదరాబాద్ డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు. స్టేషన్ పరిధిలో ఎక్కడ నేరం జరిగినా, లేదా ఏదైనా సంఘటన జరిగినా డయల్-100కి కాల్ వచ్చిన వెంటనే పెట్రోకారు, బ్లూకోల్డ్స్, రక్షక్ వాహనాల్లో పోలీసులు 5 నిమిషాల్లో జెట్ స్పీడ్తో చేరుకుంటారు. స్టేషన్ పరిధిలోని ములుగురోడ్డు, పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, గోపాల్పూర్ జంక్షన్, పబ్లిక్గార్డెన్, అంబేద్కర్ జంక్షన్, హనుమకొండ బస్స్టేషన్ చుట్టూ సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న 56 ఏరియాల్లో 36 కాలనీల ప్రజలకు మాడ్రన్గా పోలీసింగ్ సేవలు అందుతున్నాయి. 30 కాలనీల్లో 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్టేషన్కు అనుసంధానించారు. ఇటీవల నగరంలోని ఏడు అపార్ట్మెంట్లలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల దృశ్యాలు.. హనుమకొండ స్టేషన్ పరిధిలో చోరీ జరిగిన కిషన్పుర ఏరియాలోని అపార్ట్మెంట్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగానే దొంగలను గుర్తించి, ట్రాప్ చేసి పట్టుకున్నారు.
సత్వర న్యాయమే మా లక్ష్యం..
హనుమకొండ స్టేషన్ను మాడల్ పోలీస్స్టేషన్గా తీర్చిదిద్దిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఫిర్యాదు స్వీకరణ నుంచి దర్యాప్తు, నేరస్తులకు శిక్ష పడే వరకు ప్రతిదీ కంప్యూటరైజ్ ఈ-ఫైల్స్ పద్ధతిలో జరుగుతుంది. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో, దర్యాప్తు విషయాల్లో టెక్నాలజీ వినియోగిస్తున్నాం. నాతో పాటు కానిస్టేబుల్ వరకు ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపర్చుకుంటున్నం. ప్రతిది చట్టబద్దంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. బాధితులకు వీలైనంత వరకు త్వరగా న్యాయం జరగడమే మా లక్ష్యం. రోజుకు సగటున ఐదు నుంచి పది పిటిషన్లు వస్తాయి. పిటిషన్లు, నేర తీవ్రతను బట్టి విభజించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– ఎన్.కరుణాకర్, ఇన్స్పెక్టర్, హనుమకొండ