రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నది. మరో వైపు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా వర్షాకాలంలో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటిస్తున్నది. సర్కారు ఆశయానికనుగుణంగా ఈ సంవత్సరం వరంగల్ జిల్లాలో అధికార యంత్రాంగం లక్ష్యానికి మించి మొక్కలు నాటింది. కలెక్టర్ ప్రావీణ్య ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై ఈ కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు పోటీపడి మరీ ఉద్యమంలా మొక్కలు నాటుతున్నాయి. జిల్లా టార్గెట్ 25,95,150 కాగా, ఇప్పటికే 29,59,280 నాటి 114 శాతంతో తెలంగాణలోనే టాప్లో నిలిచింది. ఉద్యాన శాఖ ఫస్ట్.. డీడబ్ల్యూఎంఏ సెకండ్ ప్లేస్లో నిలిచాయి.
వరంగల్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పథకాల అమల్లో వరంగల్ జిల్లా అగ్రభాగాన నిలుస్తున్నది. నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తున్నది. ఇందుకు కృషి చేస్తున్న అధికార యంత్రాంగం ప్రశంసలు అందుకుంటున్నది. తాజాగా తెలంగాణ హరితహారం కార్యక్రమం అమల్లో జిల్లా టాప్లో నిలిచింది. మొక్కలు నాటడంలో టార్గెట్ను అధిగమించింది. ఇప్పటికే 29,59,280 మొక్కలు నాటగా, 114 శాతం దాటింది. ప్రధానంగా డీడబ్ల్యూఎంఏ, జీడబ్ల్యూఎంసీ, ఉద్యాన శాఖలు 130, పంచాయతీ, వ్యవసాయ శాఖలు 120 శాతానికిపైగా మొక్కలు నాటి ముందంజలో ఉన్నాయి. ఈ ఏడాది తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో 25,95,150 మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీంతో కలెక్టర్ ప్రావీణ్య కొద్ది నెలల క్రితం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశమై ఈ కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖకు లక్ష్యం నిర్దేశించారు.
శాఖల వారీగా పంచాయతీ 7 లక్షలు, డీడబ్ల్యూఎంఏ 5.85 లక్షలు, జీడబ్ల్యూఎంసీ 5 లక్షలు, నర్సంపేట మున్సిపాలిటీ 1,08,300, వ్యవసాయ శాఖ లక్ష, సెరికల్చర్ లక్ష, ఎక్సైజ్ శాఖ 95 వేలు, వర్ధన్నపేట మున్సిపాలిటీ 90 వేలు, ఉద్యాన శాఖ 78,750, అటవీ శాఖ 75 వేలు, విద్యా శాఖ 50 వేలు, ఇరిగేషన్ 39,200, పశు సంవర్థక శాఖ 38,400, గనుల శాఖ 8,400, పరిశ్రమల శాఖ 6 వేలు, పౌర సరఫరాల శాఖ 5 వేలు, ఐసీడీఎస్ 3,500, సహకార శాఖ 3,200, మార్కెటింగ్ శాఖ 3 వేలు, వైద్యారోగ్య శాఖ 2 వేలు, గిరిజన సంక్షేమ శాఖ 1,400, మత్స్య శాఖ 1,000, బీసీ వెల్ఫేర్ 1,000, ఎస్సీ వెల్ఫేర్ 500, మైనారిటీ వెల్ఫేర్ 500 చొప్పున మొక్కలు నాటాలని చెప్పారు. పకడ్బందీ ప్రణాళికతో ఈ లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలో పంచాయతీ శాఖ, మున్సిపాలిటీల పరిధిలోని నర్సరీల్లో పురపాలక శాఖ అధికారులు మొక్కలను పెంచారు. వీటికి తోడు అటవీ శాఖ తమ నర్సరీల్లో కూడా మొక్కలను పెంచింది. గత జూన్లో వర్షాలు కురవడం మొదలవగానే అధికారులు జిల్లాలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటడం ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది తమ నర్సరీల్లో పెరిగిన అటవీ జాతి మొక్కలతో పాటు పూలు, పండ్ల మొక్కలను కూడా ఇంటింటికీ అందజేశారు.
ఉద్యమంలా కార్యక్రమం..
కలెక్టర్ ప్రావీణ్య హరితహారం కార్యక్రమం అమలుపై విస్తృతంగా సమీక్షలు జరిపారు. డీఆర్డీవో సంపత్రావు, డీపీవో కల్పన, డీఎఫ్వో లావణ్య తదితరులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అమల్లో ప్రభుత్వ శాఖల అధికారులు పోటీపడి ఉద్యమంలా నిర్వహించారు. మొక్కలు నాటడంలో ఉత్సాహం కనబరుస్తున్నారు. డీడబ్ల్యూఎంఏ అధికారులు, సిబ్బంది మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి కెనాల్ గట్లపై పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కొత్తగా దశాబ్ది సంపద వనాలను సృష్టించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లోనూ మొక్కలను నాటడమే గాకుండా ప్రభుత్వ స్థలాల్లో బ్లాక్, కమ్యూనిటీ ప్లాంటేషన్ చేశారు. నిర్దేశిత లక్ష్యంలో గురువారం వరకు 1,08,589 మొక్కలు నాటి 137.89 శాతంతో ఉద్యానశాఖ నంబ ర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండోస్థానం డీడబ్ల్యూఎంఏది. 7,94,536 మొక్కలు నాటి 135.82 శాతంతో ఇది ప్రశంసలు పొందుతున్నది.
ఇక 6,55,054 మొక్కలు నాటి జీడబ్ల్యూఎంసీ 131.01 శాతంతో మూడోస్థానంలో ఉంది. 8,67,297 మొక్క లు నాటి పంచాయతీ శాఖ 123.90 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా జిల్లాలో అత్యధిక మొక్కలు నాటిన శాఖ ఇదే కావటం గమనార్హం. వ్యవసాయ శాఖ 1,22,700తో 122.70 శాతం, సెరికల్చర్ 1.03 లక్షలతో 103, గనుల శాఖ 8,625తో 102.68 శాతం మొక్కలు నాటడంలో వంద శాతం దాటిన ప్రభుత్వ శాఖల్లో చేరాయి. అటవీ శాఖ, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ శాఖలు వందశాతం టార్గెట్ రీచ్ అయ్యాయి. పశు సంవర్థక శాఖ 97.40, మత్స్య శాఖ 85, నర్సంపేట మున్సిపాలిటీ 66.20, ఇరిగేషన్ 64.66, విద్యాశాఖ 61.57 శాతంతో హరితహారం కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీ కేవలం 35.12 శాతంతో వెనుకబడి ఉంది. వైద్యారోగ్య శాఖతో పాటు మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు ఇప్పటివరకు ఒక మొక్క కూడా నాటలేదు. సహకార, పౌర సరఫరాల, ఎక్సైజ్, ఐసీడీఎస్ వంటి శాఖలు కూడా ఈసారి మొక్కలు నాటడంలో వెనుకబడి ఉన్నాయి. మొత్తానికి కొన్ని ప్రభుత్వ శాఖలు మొక్కలు నాటడంలో పోటీపడడం వల్ల జిల్లా నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించింది. జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నది.