డోర్నకల్, నవంబర్ 23 : రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న మిరప తోటలకు రసం పీల్చే పురుగులు తీవ్ర నష్టం కగిలిస్తున్నాయి. రెండేళ్లుగా తెల్లదోమ, తామర పురుగు, ఎర్ర నల్లి ద్వారా మిర్చి దిగుబడులు తగ్గిపోతున్నాయి. పూత, కాత దశకు వచ్చే సరికి తెల్లదోమ, నల్లి, తామర పురుగులు ఉధృతంగా పట్టి పీడిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తూ నష్టాన్ని కొంత నివారించుకోగలుగుతున్నారు. రసం పీల్చే పురుగులకు జిగురు అట్టలతో చెక్ పెడుతున్నారు. ఎకారానికి 25 నుంచి 30 వరకు (పసుపు, తెలుపు, నీలి రంగు) జిగురు అట్టలు చేన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక అట్ట రూ.25 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
మిర్చి తోట వరుసల్లో అడుగు ఎత్తున కర్రలకు వివిధ రంగుల్లో ఉండే జిగురు అట్టలను అమర్చి పాతుతున్నారు. పసుపురంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను, తెలుపు రంగు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్, నీలిరంగు జిగురు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకరిస్తున్నాయి. రసం పీల్చే పురుగులు జిగురు అట్టలకు అతుక్కుని చనిపోతాయి. జిగురు అట్టలను రైతులు ఇంట్లో కూడా సహజంగా తయారు చేసుకోచ్చు. రంగు అట్టలకు గ్రీస్ పూసి వాడుకోవచ్చు.
దిగుబడి పెరుగుతుంది..
జిగురు అట్టల వల్ల రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. చాలా మంది రైతులు మిర్చి తోటల్లో జిగురు అట్టలు పాతుకున్నారు. జిగురు అట్టలకు అతుక్కున్న పురుగులను చూసి నివారణ మందులు స్ప్రే చేయవచ్చు. మా తోటల్లో పాతిన అట్టలు మంచి ఫలితాలనిస్తున్నాయి.
– దేశిని ఉపేందర్, మిర్చి రైతు, చిలుకోడు
పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది
మిర్చి తోటలో జిగురు అట్టలు పాతుకుంటే క్రిమిసంహారక మందుల అవసరం ఉండదు. రైతులకు ఆధునిక సాగు విధానంపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నం. మిరప తోటల్లో పురుగుల నివారణ రైతులకు పెద్ద సమస్యగా మారింది. జిగురు అట్టలతో రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు.
– అనిత శ్రీ, మండల ఉద్యాన అధికారి, డోర్నకల్