వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్7 : తీవ్రవాద ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మౌలిక వసతులు మెరుగు పర్చి ప్రజలకు భద్రత కల్పిస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బీ శివధర్రెడ్డి అన్నారు. తెలంగాణ-చత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం పామునూరు శివారులోని కర్రెగుట్టలను మంగళవారం ఆయన పరిశీలించారు. అటవీ శాఖ పీసీసీఎఫ్ సీహెచ్ సువర్ణ, అక్టోపస్, గ్రేహౌండ్స్ ఏడీజీపీ డాక్టర్ అనిల్కుమార్, సీఆర్పీఎఫ్ ఐజీపీ టీ విక్రమ్, ఎస్ఐబీ ఐజీపీ సుమతి, అటవీ శాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ డాక్టర్ వీ ప్రభాకర్తో కలిసి డీజీపీ పర్యటించారు.
పామునూరు వద్ద ఏర్పాటు చేయనున్న ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ పనులతో పాటు పోలీస్ ఔట్ పోస్టు, ఫారెస్టు వాచ్ టవర్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శివధర్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి దూరమైన ప్రాంతాలను మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతున్నాయని అన్నారు. మురుమూరు రాష్ట్ర రహదారి నుంచి చత్తీస్గఢ్ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. త్వరలో పూర్తి చేసి పామునూరు మీదుగా బీజాపూర్కు నూతన రహదారిని అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.
అనంతరం వెంకటాపురం(నూగూరు) మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. పామునూరు గ్రామానికి చెందిన ఏడు కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు వారి రవాణా కోసం ఆటోతో పాటు ద్విచక్రవాహనాన్ని పంపిణీ చేశారు. అటవీ శాఖ పీసీసీఎఫ్ సీహెచ్ సువర్ణ మాట్లాడుతూములుగు జిల్లాలోని అడవులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు.
కర్రెగుట్టల రోడ్డుతో బీజాపూర్కు తగ్గనున్న దూరం : ఎస్పీ
పామునూరు రాష్ట్ర రహదారి నుంచి ప్రస్తుతం చేపట్టిన కర్రె గుట్టల రోడ్డుతో చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్కు 40 కిలోమీటర్ల మేర దూరం తగ్గనున్నదని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ వివరించారు. తొలి విడుతలో 8.7 కిలోమీటర్ల రోడ్డు, రెండో విడుతలో 18 రోజుల్లో 5.3 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించా రు. అనంతరం కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలతో పాటు మందులను, ద్వి చక్రవాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమాల్లో ఏటూరునాగారం ఏఎస్పీ మమన్భట్, డీఎఫ్వో రాహుల్ కిషన్జాదవ్, అదనపు ఎస్పీ సదానందం, సీఐలు శ్రీనివాస్, ముత్యం రమేశ్, ఎస్సైలు తిరుపతిరావు, గుర్రం కృష్ణప్రసాద్, జగదీశ్ పాల్గొన్నారు.