హనుమకొండ, జూలై 29 : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి పెళ్లి కానుక అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లకు చెందిన 114 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి గొప్ప కానుకగా ప్రజలు భావిస్తున్నారన్నారు. ఒక సంఘటన ముఖ్యమంత్రి కేసీఆర్లో ఆలోచనను రగిలిస్తే, అదే ఆలోచన నేడు లక్షలాది మంది ఆడబిడ్డలకు ఒక గొప్ప వరంగా మారిందన్నారు.
ఈ పథకాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనందిస్తున్నాయన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక చేయూతనిచ్చినట్లు చెప్పారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్నా సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వెనకి పోవడంలేదన్నారు. కాగా, శుక్రవారం జోరు వర్షాన్ని సైతం లెక చేయకుండా తమ ఇంటికి కల్యాణలక్ష్మి చెకులను తీసుకొచ్చి అందించిన చీఫ్విప్ వినయ్భాస్కర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, తహసీల్దార్ రాజ్కుమార్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో సమీక్ష
పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా నరగంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవార కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, నగర కమిషనర్ ప్రావీణ్యతో కలిసి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భగా చీఫ్విప్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి సమస్యల పరిష్కారంతో పాటు మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపడుతున్న అభివృద్ధి పనులును వెంటనే పూర్తి చేయాలన్నారు. పాత పాఠశాలల భవనాలు గుర్తించి, మరమ్మతు చేపట్టాలన్నారు. అలంకార్ జంక్షన్ నుంచి కాజీపేట వరకు జరుగుతున్న అభివృద్ధి, రోడ్లు విస్తరణ, సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. వివిధ కుల సంఘాలకు కేటాయించిన కమ్యూనిటీ భవనాల నిర్మాణ పనులు సైతం పూర్తి చేయాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బస్తీ దవాఖానలు, యూహెచ్సీల్లో మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సమీక్షలో డీఆర్వో ఎం వాసుచంద్ర, డీఈవో రంగయ్య నాయుడు, డీఎంహెచ్వో సాంబశివరావు, సిటీ ప్లానర్ వెంకన్న, కుడా, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
న్యూశాయంపేట : గ్రేటర్ 49వ డివిజన్ ప్రకాశ్రెడ్డిపేటలో రూ. 50లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రారంభించారు. కార్పొరేటర్ ఏనుగుల మానసా రాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్విప్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాగా, మైత్రీవనం సొసైటీ అధ్యక్షుడు వంగాల రాములు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన కాలనీకి సీసీరోడ్డు, డ్రైనేజీ కోసం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆకుల సాయికుమార్, వేణుగోపాల్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.