వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 25 : గిర్మాజీపేట గోవిందరాజుల స్వామి ఆలయంలో కలెక్టర్ గోపి దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టర్ దంపతులకు స్వామి వారి శేషవస్ర్తాలను అందించి, ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, ప్రణాళికల వివరాలను అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
గుట్ట పైనుంచి వరంగల్ నగరాన్ని వీక్షించారు. కాగా, ఆలయ అన్యాక్రాంతమైన ఆలయ భూములను కాపాడాలని, గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గుట్టపైకి రోడ్డు మార్గంతో పాటు భజన మందిరం, సాలగ్రామం, గుట్టపై వ్యూ పాయింట్, గార్డెన్ పనులను చేపట్టాలని అభివృద్ధి కమిటీ సభ్యులు కలెక్టర్ను కోరారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ఆలయ, ఉపాలయాల అవసరాలకు కేటాయించిన 5 ఎకరాల 25గుంటల భూమితో పాటు గోశాల కోసం ఇచ్చిన 25 గుంటల భూమికి సంబంధించి సర్వే చేపడుతామన్నారు. త్వరలోనే ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులతో గోవిందరాజుల స్వామి గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆలయ భూముల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.