నర్సంపేట రూరల్, అక్టోబర్ 6: పాండిచ్చేరి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాండిచ్చేరిలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దుయ్యబట్టారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న గవర్నర్ ప్రతిపక్ష పాత్ర వహించే వైఖరి తగదన్నారు. దేశంలో సుధీర్ఘకాలంగా నెలకొన్న వ్యవసాయం, శ్రామిక, నిరుద్యోగంతోపాటు అనేక జటిలమైన సమస్యల పరిష్కారం దిశగా, సువిశాల దేశ సమగ్రాభివృద్దే ఏకైక మార్గంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పా టు చేశారన్నారు. దేశంలో అనేక రకాల సంక్షోభాలతోపాటు విద్యుత్ సమస్య పొంచి ఉందని తెలిపారు. ఇటీవల పాండిచ్చేరి రాష్ట్రంలో వారం రోజులపాటు నిరంతరాయంగా విద్యుత్ సమస్య తలెత్తడంతో అదే రాష్ర్టానికి లెఫ్టినెంట్ గవర్నర్గా పని చేస్తున్న మన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఫిర్యాదులుగా స్వీకరిస్తూ మానిటరింగ్ చేస్తున్న గవర్నర్.. పాండిచ్చేరిలో నెలకొన్న సమస్యను తక్షణమే ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
పాండిచ్చేరిలో కరెంట్ బంద్..
పాండిచ్చేరి రాష్ట్రంలో సాక్షాత్తు గవర్నర్ నివాసముండే అధికారిక భవనానికే రెండు మూడు రోజలుగా కరెంటు లేకపోవడాన్ని తమ ఏమరపాటుగా భావించవచ్చా అని ఎమ్మెల్యే పెద్ది గవర్నర్ను ప్రశ్నించారు. సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించగలిగే సత్తా, సానుకూలత లేకపోవడం బాధాకరమన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఆంధ్రా ప్రాంతంలో కొన్నిచోట్ల కార్యరూపం దాల్చిందన్నారు. తానే స్వయంగా ఫీల్డ్ విజిట్కు వెళ్లి, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటర్లను పరిశీలించినట్లు గుర్తుచేశారు. కేంద్రం ఎక్కడా మీటర్లు పెట్టలేదని అబద్ధపు, అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే రైతులను మరింత సంక్షోభానికి నెట్టే ప్రమాదం ఉందన్నారు. ఈ విధానాన్ని సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను కేంద్రం ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదని ఎద్దేవా చేశారు. కాజీపేట రైల్వే కోచ్ మాటేలేదని, గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు అక్కడే ఆగిందని విమర్శించారు. జీఎస్టీ పెండింగ్ బకాయిలు చెల్లించలేదని కేంద్రం తీరును ఎమ్మెల్యే దుయ్యబట్టారు. నీతి ఆయోగ్కు సంబంధించి ప్రాణాళికాబద్ధంగా ఇవ్వాల్సిన నిధులను ఇప్పటి వరకు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. రాష్ర్టాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెడుతున్నదని మండిపడ్డారు.
దేశాభివృద్ధి కోసం..
తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించారని పెద్ది అన్నారు. బడు గు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తూ దేశవాప్తంగా వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతోపాటు వెనుకబాటు తనాన్ని రూపుమాపి అనేక ప్రాంతాలు, జాతులు సంక్షేమం దిశగా అడుగులు వేసేలా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. పొరుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం కేసీఆర్ను ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, టీఆర్ఎస్ నర్సంపేట పట్టణ, మండల అధ్యక్షులు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, నామాల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, ముఖ్య నాయకులు గుంటి కిషన్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి, రాయిడి రవీందర్రెడ్డి, దార్ల రమాదేవి, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు.