సుబేదారి, సెప్టెంబర్ 13 : వరంగల్ నగరంలో ఇటీవల మట్టెవాడ, హనుమకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్మెంట్లలో తాళం వేసి ఉన్న ప్లాట్లలో చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రంగనాథ్, దొంగల ముఠాను అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్కు చెందిన అక్బర్ ఖురేషి, కపిల్ జాటోవు, మీరట్కు చెందిన మహ్మద్ షరీఫ్, ఎండీ షహజాద్ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాలో షరీఫ్, షహజాద్ తండ్రీ కొడుకులు, వీరద్దరు చోరీలకు ఆర్గనైజర్లుగా ఉండి కొంత మందిని ముఠాలో చేర్చుకొని చాలా చోట్ల చోరీలకు పాల్పడ్డారని సీపీ తెలిపారు.
ఈ ముఠా ఈనెల4న ఢిల్లీ నుంచి వచ్చి ఆదిలాబాద్లో చోరీలకు పాల్పడి అక్కడి నుంచి వరంగల్ నగరానికి 5న వచ్చారని సీపీ తెలిపారు. అదే రోజు నగరంలోని అపార్ట్మెంట్లలో పెద్ద ఎత్తున బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. ముందుగా మట్టెవాడ పీఎస్ పరిధిలో వద్ది రాజు అపార్ట్మెంట్లోకి దొంగలు వెళ్తుండగా వాచ్మెన్ అడ్డగించడంతో దొంగలు పిస్టల్తో బెదిరించారు. ఈఘటన తర్వాత వెంటనే దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు సీపీ తెలిపారు. ఈ దొంగల ముఠా కారులో వరంగల్నుంచి బెంగుళూరు వెళ్లి అక్కడ నాలుగు చోరీలకు పాల్పడ్డారు.
తెలంగాణ, కర్నాటక, ఏపీ రాష్ర్టాల హైవే టోల్ గేట్ల ప్లాజాల సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కర్నూల్ టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, సిబ్బంది సాయంతో నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. సుబేదారి పీఎస్ పరిధిలోని తెలంగాణ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన వెర్నా కారును ఆపి తనిఖీలు చేస్తుండగా, కారులో ఉన్న నలుగురు దిగి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. వారిని అదుపులోకి తీసుకొని, విచారించగా వరంగల్ నగరంలో అపార్ట్మెంట్లలో చోరీలకు పాల్పడింది వీరే అని నిర్ధారణ అయిందని సీపీ తెలిపారు. ఈ ముఠా నుంచి నుంచి రెండు కోట్ల విలువైన రెండు కిలోల 380 గ్రాముల బంగారు, వజ్రాల అభరణాలు, 5 లక్షల విలువ చేసే 104 కిలోల గంజాయి, ఒక పిస్టల్, ఐదు రౌండ్లు బుల్లెట్లు, కారు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్కార్డులు, ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు రాష్ర్టాల్లో పది చోరీలు..
ఘజియాబాద్ అంతరాష్ట్ర ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మొత్తం పది చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. మేలో ఏపీ రాష్ట్రం కర్నూల్లో చోరీలకు పాల్పడి, జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చారు. చోరీల అనంతరం తప్పించుకోవడానికి కారును కొనుగోలు చేసి అదే కారులో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారు. నిందితులు దేశ వ్యాప్తంగా మొత్తం 30 చోరీలకు పాల్పడినట్లు సీపీ చెప్పారు. టెక్నాలజీ కోసం వాకీటాకీలను వినియోగిస్తారని సీపీ తెలిపారు. ఈముఠాకు ఢిల్లీ పోలీసులతో సంబంధాలు ఉన్నట్లు తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు. వారిపైన కూడా విచారణ కొనసాగుతుందని, వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్న దానిపై దృష్టిపెట్టి, పూర్తి స్థాయి విచారణ అనంతరం ముఠాతో సంబధాలు ఉన్నవారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ వెల్లడించారు.
పోలీసు బృందాలకు సీపీ అభినందనలు
అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతభ కనబరిచిన ప్రత్యేక పోలీసు బృందాలు క్రైమ్స్ డీసీపీ మురళీధర్, క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య, మట్టెవాడ, హనుమకొండ, సుబేదారి, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, కరుణాకర్, షూకూర్, సూర్యా ప్రసాద్, ఏఏఓ సల్మాన్పాషా, ఎస్సైలు విఠల్, కిశోర్కుమార్, సంపత్కుమార్, రాజేందర్, బాబురావు, యాదగిరి, ఏఎస్సై తిరుపతి, గోపాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్, రవి, మున్నా, ఆలీ, మధు, వంశీ, విశ్వేశ్వర్, శివ, గౌస్ పాషా సదానందంను సీపీ అభినందించారు. కర్నూల్ టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, కర్నూల్ జిల్లా ఎస్పీకి సీపీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
అపార్ట్మెంట్లలో నివాసం ఉండే వారు చోరీల విషయంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. ప్రధాన గేట్ వద్ద వాచ్మెన్ ఉంచాలని సూచించారు. అపరిచితుల వివరాలు అడిగిన తర్వాతే లోపలికి అనుమతించాలన్నారు. ప్లాట్ ప్రధాన డోర్లకు నాణ్యమైన తాళాలు వేసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు పక్కవారి, లేదా వాచ్మెన్కు సమాచారం ఇవ్వాలన్నారు. తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.