తొర్రూరు, అక్టోబర్ 25 : ఓవైపు రాష్ట్ర మంత్రిగా బాధ్యతల్లో బిజీగా ఉన్నా.. మరోవైపు యువత బంగారు భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. విలువైన ప్రజా సేవలందిస్తూ కేంద్ర అవార్డులను కైవసం చేసుకుంటూనే చదువు విలువ తెలిసిన ఆయన ఉద్యోగార్థులకు అండగా నిలిచారు. తాను స్థాపించిన ‘ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఉద్యోగ శిక్షణ పొందిన వారిలో చాలా మంది అర్హత సాధించారు. రూ.లక్షలు వెచ్చించి యువతకు అండగా నిలిచిన ‘ట్రస్ట్’ను ఎర్రబెల్లి సతీమణి ఉష అన్నీ తానై నడిపిస్తున్నారు.
90 రోజులు శిక్షణ..
ట్రస్ట్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్స్ కోసం 90 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు కేంద్రాల్లో చేపట్టారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలను కలుపుకొని పాలకుర్తి కేంద్రంగా, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలను కలుపుకొని తొర్రూరు కేంద్రంగా ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అల్లోజు సత్యనారాయణాచారి పర్యవేక్షణలో అనుభవం కలిగిన ఫ్యాకల్టీ బృందం ద్వారా 90 రోజులు శిక్షణ ఇప్పించారు. 11 సబ్జెక్టులతో కూడిన మెటీరియల్ను ట్రస్ట్ ద్వారా దాదాపు వెయ్యి మంది ఉద్యోగార్థులకు ఉచితంగా అందించారు. శిక్షణ సమయంలో భోజన వసతి కల్పించారు. తొర్రూరులో 250 మంది కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోగా వీరిలో 70 మంది క్వాలిఫై అయ్యారు. 150 మంది ఎస్ఐ కోచింగ్ తీసుకోగా 25 మంది క్వాలిఫై అయ్యారు. 600 మంది గ్రూప్-1, గ్రూప్ -2 శిక్షణ తీసుకున్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
గ్రామీణులకు అండగా..
ఉన్నత చదువులు, ఉద్యోగాల సాధన కోసం సరైన గైడెన్స్ లేక చాలామంది యువతీయువకులు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అలాంటి వారికి దిశానిర్దేశం చేసి, వారి భవిష్యత్ను బంగారుమయం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక కార్యాచరణను అమలు చేశారు. గ్రామాల్లో పిల్లలను చదివించేందుకు పేద తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి చలించిన దయాకర్ రావు, ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కోచింగ్ తీసుకునే స్థోమత లేని ఎందరో యువతీయువకులకు తొర్రూరు, పాలకుర్తిలో శిక్షణ ఇప్పించారు.
ఆడబిడ్డలకు ప్రత్యేకం..
ఆడబిడ్డలు పైచదువులు చదవడం ఓ సవాలే. అందునా వివాహమైన తర్వాత వారికి బాధ్యతలు పెరుగుతాయి. పైగా దూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకునే తీరిక ఉండదు. అలాంటి వారి కోసం ఎర్రబెల్లి ట్రస్ట్ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. మహిళల కష్టాలను గుర్తెరిగి తొర్రూరులోనే టెట్ శిక్షణ ఇప్పించింది. సుమారు 250 మందికిపైగా ఆడబిడ్డలు ఈ తరగతులను వినియోగించుకోగా వీరిలో 214 మంది క్వాలిఫై అయ్యారు.
ఒకో అభ్యర్థిపై సుమారు రూ.లక్ష ఖర్చు
ట్రస్ట్ ఆధ్వర్యంలో తొర్రూరు, పాలకుర్తిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సుమారు 2300 మంది శిక్షణ తీసుకున్నారు. వారికి శిక్షణ కాలంలో భోజనం, వసతి, స్టడీ మెటీరియల్ కోసం ఒకో అభ్యర్థిపై సుమారు రూ.70 వేల నుంచి రూ.లక్ష దాకా ట్రస్ట్ వెచ్చించింది.
పట్టరాని ఆనందం
నిరుద్యోగులు శిక్షణ తీసుకుంటూ పొందుతున్న అనుభూతిని కళ్లారా చూస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. ఎంత ఖర్చు పెట్టామనే కంటే ఎందరు తమ జీవితాలను బంగారుమయం చేసుకున్నారనేది ముఖ్యం. నిరుపేద పిల్లలకు ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోతుంటే వారి తల్లిదండ్రులు కృతజ్ఞతగా కళ్ల నుంచి ధారలు కారుస్తూ వెళ్తుంటే ఇది కాదా జన్మకు సార్థకత అనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు కేవలం ప్రజావసరాలు తీర్చడమే అని కాకుండా నిరుపేదల ఇళ్లల్లో పరిస్థితులను కూడా చూడాలని మంత్రి దయాకర్రావు నుంచే నేర్చుకున్నాను. ఇప్పటికి వందల మంది యువతీయువకులు ఉద్యోగ, ఉపాధి మార్గాలు వెతుకున్నారు. పోటీ పరీక్షల్లో క్వాలిఫై అవుతుంటే నాకు, దయాకర్రావుకు చెప్పలేనంత ఆనందం.
-ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే..
మంత్రి దయాకర్రావు, ఉషా దయాకర్రావు సలహాల మేరకు రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారుల సహకారంతో, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖుల సమన్వయంతో 90 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. జయశంకర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అల్లూరి సత్యనారాయణాచారి పర్యవేక్షణలో పూర్తి క్రమశిక్షణ, సమయపాలన, ఉచిత భోజనం, ఉచిత మెటీరియల్, అనుభవం కలిగిన ఫ్యాక్టల్టీతో ట్రైనింగ్ పూర్తి చేయించాం. పాలకుర్తి నియోజకవర్గంలోని పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ఎర్రబెల్లి చారిటబుల్ లక్ష్యం. ఈ ఫలితాలు మేము పడిన కష్టానికి కొలమానంగా నిలిచాయి.
-పంజా కల్పన, ట్రస్ట్ పరిశీలకురాలు
శిక్షణ వల్లే క్వాలిఫై అయ్యాను
ఇంత కాంపిటీషన్లో ఎస్ఐగా క్వాలిఫై అయినందుకు చాలా సంతో షంగా ఉంది. హైదరాబాద్ వెళ్లి కోచిం గ్ తీసుకోలేకపోయాను. ఆ టైంలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వాళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలిసి దరఖాస్తు చేసుకున్నా. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల దాకా తరగతులు నిర్వహించారు. అన్ని సబ్జెక్టులను కవర్ చేశారు. ఒకవేళ మంత్రి దయాకర్రావు తొర్రూరులో కోచింగ్ సెంటర్ పెట్టకపోయుంటే ఈ రోజు నేను ఎస్ఐగా క్వాలి ఫై కాకపోదును. ఉచిత భోజనం, క్వాలి టీ ఎడ్యుకేషన్ను అందించిన ట్రస్ట్ చైర్పర్సన్ ఉషా దయాకర్రావు, మంత్రి దయాకర్రావుకు మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది.
-కాలూరి స్వాతి, చింతలపల్లి, ఎస్ఐ క్వాలిఫై అభ్యర్థి
మంత్రి సహకారం వల్లే..
నేను రోజూ వ్యవసాయం చేసుకుంటూనే ఎర్రబెల్లి ట్రస్ట్ కోచింగ్ క్యాంప్లో క్లాసులు వినేవాన్ని. మాది పేద కుటుంబం. మంత్రి దయాకర్రావు అందించిన సహకారం వల్లే నేను ఎస్ఐగా క్వాలిఫై అయ్యాను. ఉషా దయాకర్రావు మేడం అందించిన ప్రేరణతో కచ్చితంగా ఎస్ఐ ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం ఉంది.
-మేరుగు ప్రశాంత్, ఉప్పరగూడెం, ఎస్ఐ క్వాలిఫై అభ్యర్థి
దగ్గర ఉండడం వల్లే..
నేను డిగ్రీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోచింగ్ సెంటర్లో క్లాసులకు హాజరయ్యాను. తొర్రూరులో కోచింగ్ సెంటర్ పెట్టడం వల్లే ఇటు డిగ్రీ పరీక్షలు రాయడం, అటు కానిస్టేబుల్ కోచింగ్ క్లాస్లకు వెళ్లడం ఒకే కాలంలో వీలైంది. ఎంతో అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో కోచింగ్ ఇచ్చారు. మెయిన్స్కు కూడా కోచింగ్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాం.
-ఆనుగంటి నవీన్, పోలేపల్లి, కానిస్టేబుల్ క్వాలిఫై అభ్యర్థి