హనుమకొండ, ఏప్రిల్ 8 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండలోని ఆయన నివాసంలో వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విసృ్తత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లితో పాటు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ పార్టీకి మండల, గ్రామ కమిటీలే సుప్రీం అన్నారు. ఇతర పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలను కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. కార్యకర్తలందరూ కలిసి ఉండాలని సూచించారు. ప్రజల్లో మార్పు వస్తోందని.. మోసపోయాం అని తెలుసుకున్నారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సీఎం రేవంత్రెడ్డి బురద చల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపు రాజకీయాలకు ఎవరూ తలవంచ వద్దన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా ఉండాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, వర్ధన్నపేట నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మండల, గ్రామ కమిటీ నాయకులు, తాజా మాజీ సర్పంచ్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువజన సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.