జన్యు సవరణతో జన్యు సంబంధిత వ్యాధులు తగ్గించవచ్చని, దీని ద్వారా భవిష్యత్లో దేశంలో ఆకలి కేకలను, పోషకాహార లోపాలను తగ్గించడం సాధ్యపడుతుందని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. కేయూలో ‘ప్లాంట్ బయో టెక్నాలజీ అండ్ జినోమ్ ఎడిటింగ్’పై అంతర్జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభం కాగా, వివిధ దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 120 పరిశోధనా పత్రాలు సమర్పించారు. కేయూ వీసీ ప్రొఫెసర్ రమేశ్ మాట్లాడుతూ శాస్త్రీయ ఫలితాల ద్వారా సమాజానికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. జినోమ్ ఎడిటింగ్తో నూతన వంగడాలతో పాటు, ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు.
హనుమకొండ చౌరస్తా, జూన్ 27 : జన్యు సవరణతో ఆహార భద్రత ఉంటుదని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేశ్ అన్నారు. కేయూ బయోటెక్నాలజీ విభాగం, యునైటెడ్ కింగ్డం, వేల్స్, అబెర్యస్త్వ్యత్ యూనివర్సిటీ సహకారంతో ‘ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జీనోమ్ ఎడిటింగ్’ అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును మంగళవారం ప్రారంభించారు. ఆచార్యులు ఎ.సదానందం అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ పాల్గొని ప్రసంగించారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార కొరత తీరిందన్నారు.
జన్యుసవరణ(జీనోమ్ ఎడిటింగ్)తో నూతన వంగడాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఇప్పటికే ప్లాంట్ బయోటెక్నాలజీతో ఉత్పాదకత, పోషక విలువలు పెరిగాయన్నారు. జన్యుసవరణ ద్వారా జన్యు సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చనారు. దీని ద్వారా దేశంలో ఆకలి కేకలు, పోషక ఆహార లోపాలు తగ్గించవచ్చన్నారు. మరిన్ని జాగ్రత్తలతో జన్యుసవరణను అమలు చేస్తే మానవ అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడుతుందన్నారు. ఈ సదస్సులో ‘జినోమ్ ఎడిటింగ్ రెవల్యూషన్ ఇన్ లైఫ్ సైన్సు’ అనే అంశంపై అమెరికా సంయుక్త రాష్ట్రాల జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ ఆచార్యులు శ్రీనివాసన్ చంద్రసేగరాన్ కీలక ఉపన్యాసం చేశారు.
ఆయన మాట్లాడుతూ దేశంలో చాపకింద నీరుల ఉన్న ‘సికిల్ సెల్ అనిమియా’ను తగ్గించడానికి జినోమ్ ఎడిటింగ్ ఉపయోగపడుతుందన్నారు. కూరగాయల సైజు, పోషక విలువలు పెంచడానికి దోహదపడుతుందన్నారు. జీనోమ్ మార్పిడి(జెనిటిక్ ఇంజినీరింగ్) ద్వారా బీటీ కాటన్ తయారైంది కానీ, ఈ పద్ధతిని ఈ ఐరోపా, ఇతర దేశాలు ఉపయోగించలేదన్నారు. జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఎలాంటి నష్టాలు రావన్నారు.
ఈ పద్ధతి ద్వారా కూరగాయలు, పండ్లు ఆక్సీకరణ చెందకుండా చేయవచ్చన్నారు. జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీతో మరింత మందికి వ్యాక్సిన్లను పండ్లు, కూరగాయల ద్వా రా అందచేయవచ్చన్నారు. అనంతరం ‘ప్లాంట్ బయో టెక్నాలజీ అండ్ జినోమ్ ఎడిటింగ్’ సావనీర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా ముర్దాక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంజీకే జోన్స్, అబెర్యస్త్వ్యత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లూయీస్ మూర్, ప్రొఫెసర్ డైలాన్ ఫిలిప్స్, ప్రొఫెసర్ హ్యుజోన్స్, రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ఎం సుందరం, మలేషియా, మల యా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ అన్ హరికృష్ణ, సింగపూర్, నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ పీ కు మార్, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టీ శ్రీనివాసరావు, సదస్సు కోచైర్మన్ ప్రొఫెసర్ ఎన్ రామస్వామి, విభాగాధిపతి డాక్టర్ పీ శ్రీనివాస్, డాక్టర్ ఏవీ రావు, డాక్టర్ టీ శాస్త్రి పాల్గొన్నారు.
సభ ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేయగా మొత్తం 120 పరిశోధనా పత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొదటి రోజు 40 మంది వివిధ అంశాలపై పోస్టర్లు సమర్పించారు. వివిధ జాతీయ సంస్థల నుంచి ఆరుగురు శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఆర్ఎం సుందరం, త్యాగి, డైనల్ ఫిలిప్స్, ఈవీ సోనియా, హితేంద్రకుమార్ పటేల్, డాక్టర్ రాహుల్కుమార్, వివిధ టెక్నికల్ సెషన్లలో విస్తృత ప్రసంగం చేశారు. వీటిలో రెండు ప్లీనరీ లెక్చర్లు, ఐదు విషయ సంబంధిత సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా రోబోటిక్..
కేయూ అంతర్జాతీయ సదస్సులో రోబోటిక్ పరికరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్త్సెన్స్ టెర్రసెంటియా అనే అమెరికన్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ పరికరాన్ని సదస్సులో ప్రదర్శించారు. దీన్ని మొదటిసారిగా అమెరికాలో తయారు చేశామని కంపెనీ ప్రతినిధి స్వరాజ్ తెలిపారు. ఈ పరికరం భారతదేశంలోని రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అక్షయ అగ్రి కంపెనీ ద్వారా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ పరికరం రైతులు వేసిన పంటలో జరిగే నష్టాలను గుర్తిస్తుందన్నారు. దీన్ని సెల్ఫోన్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ పరికరానికి చుట్టూ కెమెరాలు ఉంటాయని, ఇవి మొక కాండానికి పట్టుకున్న పురుగులను గుర్తిస్తుందని తెలిపారు. ఆయిల్పామ్ తోటల కోసం రోబోట్, స్ప్రే సామర్థ్యాలతో కచ్చితమైన అప్లికేషన్, 6 గంటల బ్యాటరీ సామర్థ్యంతో రోజు 40 హెక్టార్లు కవరేజ్ చేస్తుందన్నారు. ఎరువులు వేయడం, పిచికారీ చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. 500 కిలోల బరువు మోయడం దీని ప్రత్యేకత అని వివరించారు.