Warangal | పోచమ్మమైదాన్, జూన్ 10 : కళల కాణాచిగా గుర్తింపు పొందిన ఓరుగల్లు ప్రాశస్త్యాన్ని ఒక్కమాటలో వర్ణించలేం. సహజకవి బమ్మెర, తొలి తెలుగు విప్లవకవి సోమనాథుడి వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాశరథి, కాళోజీ సోదరుల స్ఫూర్తితో ఇక్కడి కవులు, రచయితలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వైభవాన్ని ఇనుమడింపచేస్తున్నారు. నేటి యువతరం కవులకు ప్రేరణ కలిగించడంతో పాటు ప్రజా చైతనం కోసం సాహితీ, సాంస్కృతిక సంస్థలు ఏర్పాటు చేశారు. యేటా పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కవులు, కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. సహృదయ సాహితీ సాంస్కృతిక సంస్థ, పోతన విజాన పీఠం, కాళోజీ ఫౌండేషన్, తెలంగాణ రచయితల సంఘం, ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్, మిత్ర మండలి, అంపశయ్య లిటరరీ ట్రస్ట్, వరల్డ్ పీస్ అసోసియేషన్, విద్యా ఫౌండేషన్, అభిరుచి ఆర్ట్స్ అకాడమీ, జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ, నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి, రంగస్థల వేదిక, శ్రీలేఖ సాహితీ సంస్థ, కళా భారతి ఆరెపల్లి తదితర సంస్థలు పలు కార్యక్రమాల ఓరుగల్లు ఔన్నత్యాన్ని చాటుతూనే సాహితీ సేవలో తరిస్తున్నాయి.
వరంగల్ నగరానికి చెందిన ప్రజా కవి కాళోజీ నారాయణరావుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిచ్చింది. వరంగల్లో ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టింది. సాహితీవేత్తలు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా హనుమకొండలో కాళోజీ పేరిట కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నది. కాళోజీ పేర ప్రతి సంవత్సరం కవులు, రచయితలకు ప్రత్యేకంగా పురస్కారాలను అందిస్తున్నది. నగదు పురస్కారాలను సైతం ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నది. మహాకవుల పుట్టినిండ్లు పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాల్లో పర్యాటకరంగ పనులను వేగంగా పూర్తి చేస్తున్నది. పాలకుర్తిలో సోమనాథుడి కల్యాణ మండపం, బమ్మెరలో పోతన స్మారక మందిరం, వల్మిడిలో సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి, సత్రాల నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చింది. పాలకుర్తిలో సోమనాథ కళాపీఠం కవులు, కళాకారులకు నిలయంగా ఉంది. భాగవతాన్ని తెలుగులో రాసిన బమ్మెర పోతన పేరిట వరంగల్లో ప్రత్యేకంగా సాహితీ సభలు, కళా ప్రదర్శనల కోసం పోతన విజానం పీఠం నెలకొల్పారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’ నిర్వహించనున్నది. ఈ మేరకు జిల్లా స్థాయిలో కవిసమ్మేళనాలకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించనుంది.
నాకు 70 ఏండ్లు. ఎనకటి కాలం యాదికొచ్చి కండ్లలో నీళ్లు తిరుగుతుంటే నేటి అభివృద్ధి ఆ నీళ్లను ఆనంద భాష్పాలుగా మార్చింది. పాలకులను విమర్శించే అలవాటున్న కవులకు ప్రభుత్వాన్ని కీర్తించే కాలం కూడా వస్తుందని, ఇతరుల ముందు తెలంగానోళ్లు తలలెత్తుకొని నిలబడే కాలం వస్తుందని, మా పొలాల గల్లీల్లో నింగి గంగై కూడా పారుతుందని, మా పాలకునికి దేశంలో డిమాండ్ పెరుగుతుందని కలలో కూడా అనుకోలేదు.
-ప్రముఖ కవి సిరాజొద్దీన్
తొలి స్వతంత్ర కవి పాల్కురికి సోమనాథుడు, సహజ పండితుడు బమ్మెర పోతనామాత్యుడు, ఆదికవి వాల్మీకి మహర్షిల జన్మస్థలాలను తెలంగాణ ప్రభుత్వం పర్యాటక వలయంగా అభివృద్ధి చేయడం సంతోషదాయకం. మంత్రి దయాకర్రావు పట్టుదలతో పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథ తెలుగు విశ్వవిద్యాలయం అని పేరు పెట్టాలని సాహితీవేత్తలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
– రాపోలు సత్యనారాయణ, సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు
దేశ ప్రగతిలో ముందు
నిలుస్తూ తెలంగాణ నేడు
దశాబ్ది పండుగ సంబురాలను
జరుపుకుంటున్నది చూడు
బలిదానాల అమరవీరుల
త్యాగనిరతిని మదిలో స్మరిస్తూ
బతుకమ్మ బోనాల
సంస్కృతీ సంప్రదాయాల్ని పరిరక్షిస్తూ
మిషన్ భగీరథ పథకంతో
ఇంటింటికీ తాగు జలం
కాళేశ్వరం ప్రాజెక్టులతో
ప్రతిపంటకు సాగుజలం
ప్రతిఏటా ఎకరాకు పదివేలు
రైతుబంధు సాయం
ప్రతి రైతుకు ఐదు లక్షలు
రైతు బీమా వ్యూహం
నిర్విరామంగా వ్యవసాయానికి
నిత్యం ఉచిత కరెంటు
గగనతలంపై మెట్రో రైల్తో
గమ్యం చేరుట అద్భుతం
-ఆడెపు రవీందర్, రంగసాయిపేట