ఖిలావరంగల్, మార్చి 15 : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. అరగంట ముందే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా కేంద్రాలకు చేరుకున్నారు. కలెక్టర్ ప్రావీణ్య పలు కేంద్రాలను తనిఖీ చేశారు. 27 పరీక్ష కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ కలిపి 7132 మంది హాజరు కావాల్సి ఉండగా 775 మంది గైర్హాజరయినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు.
నర్సంపేటలో..
నర్సంపేట రూరల్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నర్సంపేట పట్టణంలోని సర్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, వల్లబ్నగర్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్, కాకతీయ గ్రాడ్యుయేట్ జూనియర్ కళాశాల, త్రివేణి మహిళా జూనియర్ కళాశాల, లక్నేపల్లి గ్రామ శివారు బాలాజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్ష రాశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో మౌళిక వసతులను కల్పించారు.
ఖానాపురంలో..
ఖానాపురం : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 132 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలను డెక్ ఆఫీసర్ జితేందర్రెడ్డి, శ్రీధర్రెడ్డి పరిశీలించారు.
రాయపర్తిలో..
రాయపర్తి : మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుమారు 300 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
నలుగురు గైర్హాజరు..
పర్వతగిరి : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 198 మంది విద్యార్థులకు ముగ్గురు గైర్హాజరయినట్లు ప్రిన్సిపాల్ ఆర్ సమ్మయ్య తెలిపారు. మోడల్ స్కూల్లో 163 మందికి ఒక్క విద్యార్థి హాజరు కాలేదని ప్రిన్సిపాల్ గణేశ్కుమార్ తెలిపారు. సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.
8 మంది గైర్హాజరు..
సంగెం : సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 216 మందికి 208 మంది విద్యార్థులు హాజరు కాగా, మరో 8 మంది గైర్హాజరయినట్లు ప్రిన్సిపాల్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు.