పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 10 : కన్నతండ్రే కాలయముడయ్యాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కూతుళ్లకే విషం పెట్టాడు. కుటుంబ కలహాలకు అభంశుభం తెలియని పిల్లలను బలిచేశాడు. పరిస్థితి విషమించి పెద్దకూతురు చనిపోగా, చిన్నకూతురు చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడగా, ఉమ్మడిజిల్లాలో కలకలం రేపింది. పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురానికి చెందిన గూడెం శ్రీను ధనలక్ష్మీ దంపతులు. వీరికి 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. శ్రీను మేస్త్రీ పని చేస్తుంటాడు.
పెళ్లినాటి నుంచీ దంపతులకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భార్య మీద కోపం పెంచుకున్న శ్రీను, పనిపై ధనలక్ష్మి హనుమకొండకు వెళ్లడం చూసి కూతుర్లు నాగప్రియ (9), నందిని (5)కి ఈనెల 6న గురువారం కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించాడు. తర్వాత ఇద్దరికీ అన్నం తినిపించాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించి చిన్నారులు అపస్మాకర స్థితిలోకి వెళ్లడంతో శ్రీను ఎవరికీ చెప్పకుండానే మొదట జనగామ ఏరియా దవాఖానకు తీసుకెళ్లాడు.
పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించాడు. చికిత్స పొందుతూ నాగప్రియ (9) సోమవారం మృతి చెందింది. చిన్న కూతురు నందిని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవనపల్లి విశ్వేశ్వర్, ఎస్ఐ తాళ్ల శ్రీకాంత్ తెలిపారు. కాగా శ్రీను పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.