వరంగల్, మార్చి 11 : గ్రేటర్లో ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు అరకొర కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా అధికారులు హనుమకొండ, వరంగల్లో 6 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. అక్కడ సిబ్బంది కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. పలు కేంద్రాల వద్ద ఎండలో అవస్థలు పడుతున్నారు. తాగునీటి వసతి కల్పించకపోవడంతో ఆగమవుతున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఇతర పౌరసేవల కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయినా బల్దియా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాగా, ప్రజాపాలన సవరణలు, కొత్త దరఖాస్తుల స్వీకరణ కోసం అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బల్దియాలో కాకుండా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.